
అయోధ్య: ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామ మందిరంలో చోరీ జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సోమవారం 'శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్' తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా కృష్ణ మోహన్(73)ను నియమించారు. ట్రస్ట్ నిర్వహించిన కీలక సమావేశంలో ప్రస్తుత ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ రాజీనామాను ఆమోదించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది.
దాదాపు రెండు గంటలకు పైగా సాగిన సమావేశం అనంతరం ట్రస్ట్ కోశాధికారి స్వామి గోవింద్ దేవ్ గిరి మహారాజ్ మీడియాతో మాట్లాడుతూ.. చోరీ ఆరోపణల పట్ల ట్రస్ట్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోందని, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అలాగే, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గతంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) నివేదికను చర్చించేందుకు జూలై 22న ట్రస్ట్ మళ్లీ సమావేశమవుతుందని ఆయన తెలిపారు.
"చోరీ అనేది నేరమేనని మేము స్పష్టంగా చెబుతున్నాము. ప్రస్తుతం SIT ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తోంది. అది పరిపాలనా యంత్రాంగం బాధ్యత. నేరానికి పాల్పడిన వారితో పాటు, సహకరించిన వారిని కూడా పట్టుకుని, నేరానికి తగిన శిక్ష పడేలా చూడాలని కోరుతున్నాము" అని ఆయన పేర్కొన్నారు.
ఎవరీ కృష్ణ మోహన్?
మహారాష్ట్ర కేడర్కు చెందిన మాజీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారి అయిన కృష్ణ మోహన్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)లో సీనియర్ సభ్యుడిగా ఉన్నారు. ఆయన తూర్పు ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి RSS ప్రాంతీయ అధిపతిగా కూడా పనిచేశారు. ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్ ప్రాంతానికి చెందిన మోహన్ ను.. ట్రస్టీ కామేశ్వర్ చౌపాల్ మరణం తర్వాత, గత ఏడాది సెప్టెంబరులో ట్రస్ట్ శాశ్వత సభ్యుడిగా నియమించారు. ట్రస్ట్ శాశ్వత ప్రధాన కార్యదర్శి నియామకం జరిగే వరకు ఆయన ట్రస్ట్ రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షించనున్నారు.













