వృద్ధులైన తల్లిదండ్రులను వేధింపులకు గురిచేసిన వ్యక్తికి 60 రోజుల జైలు శిక్ష, జరిమానా విధిస్తూ కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన జి. శ్రీనివాస్ అనే వ్యక్తి తన వృద్ధ తల్లిదండ్రులను నిరంతరం వేధింపులకు గురిచేస్తున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు నారాయణగూడ పోలీసులు నిందితుడిపై సెక్షన్ 70B సిపి యాక్ట్ (సిపి యాక్ట్), 115(2) బిఎన్‌ఎస్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఆధారాలు సేకరించిన పోలీసులు వాటిని కోర్టులో సమర్పించడంతో వాటిని పరిశీలించిన నాంపల్లిలోని గౌరవ ఐదవ స్పెషల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు నిందితుడికి రెండు నెలల జైలు శిక్ష(60 రోజులు), రూ.50 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. నారాయణగూడ పోలీస్ స్టేషన్ ఎస్సై జె. శ్రీకాంత్ రెడ్డి కేసు దర్యాప్తు చేశారు. తల్లిదండ్రులను వేధించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, సీనియర్ సిటిజన్ల భద్రతకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.