
తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ మంగళవారం తన పదవికి రాజీనామా చేసినట్లు డీఎంకే వర్గాలు వెల్లడించాయి. ఆయన రాజీనామా పత్రాన్ని గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ కార్యాలయానికి పంపించినట్లు సమాచారం. తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ఎం.కే. స్టాలిన్, ఆయన మంత్రివర్గం రాజీనామాలను ఆమోదించారు. ఎన్నికల్లో పరాజయం అనంతరం స్టాలిన్ తన పదవికి రాజీనామా సమర్పించగా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగే వరకు పదవిలో కొనసాగాలని గవర్నర్ సూచించారు. ఏప్రిల్ 23న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే చేత డీఎంకే పరాజయం పాలైంది. 234 సభ్యుల అసెంబ్లీలో డీఎంకే 59 స్థానాలు గెలుచుకుని ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. అన్నాడీఎంకే 47 స్థానాలు సాధించగా, టీవీకే 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఇకపై డీఎంకే బలమైన ప్రతిపక్షంగా పనిచేస్తుందని స్టాలిన్ తెలిపారు.














