
హైదరాబాద్: దేవాదులకు వెళ్లి కాంగ్రెస్ మంత్రులు తాము కట్టిన ప్రాజెక్టు అని చెప్పుకుంటున్నారని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. దేవాదులలో మోటార్లు నడపకుండా నీళ్లెలా ఇస్తారు అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు మాటలు ఎక్కువ.. చేతలు తక్కువని, ఆయకట్టుకు సరిపడా నీళ్లున్నా ఇవ్వడం లేదని విమర్శించారు. 10 పంపులు నడుపుతున్నామన్నారని, నిన్న కూడా 5 పంపులే నడుస్తున్నాయని మండిపడ్డారు. బోర్లు ఎండిపోతే పంటలు కాపాడుకునేందుకు రైతులు తంటాలు పడతారని, మాటలు నమ్మి నాట్లు వేసుకున్న రైతుల పరిస్థితి ఏంటి? అని హరీష్ రావు ప్రశ్నించారు. మంత్రుల మాట, వరంగల్ కలెక్టర్ ది మరో మాట ఉంటుందా? అని ప్రశ్నించారు. రామప్ప కింద తూములు మూసివేశారని, నాట్లు వేసిన రైతుల పరిస్థితి ఏంటి? అని గోదావరిలో నీళ్లు ఉండగా తూములు ఎందుకు మూసివేశారు? అని నిలదీశారు. సకాలంలో మోటార్లు మరమ్మత్తు చేయకపోవడం, ట్యాంకర్లు, బిందెలు, సీసాలతో పంటలకు చుక్క చుక్క నీళ్లు వేసే ఈ పరిస్థితి ఏర్పడిందని, ధ్వజమెత్తారు. 10 మోటార్లు నడపలేకపోతున్నామని రైతులకు క్షమాపణ చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.











