
‘శబరిమల ఆలయం సహా ప్రార్థనా ప్రదేశాల్లో మహిళల పట్ల వివక్ష’ కేసులో గురువారం మరోసారి విచారణ జరిగింది. ఈ సందర్భంగా దేశంలోని ప్రముఖ రచయితలు, మేధావుల అభిప్రాయాలను గౌరవిస్తామని, ‘వాట్సాప్ యూనివర్సిటీ’ నుంచి వచ్చే సమాచారాన్ని మాత్రం అంగీకరించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కేరళలోని శబరిమల శ్రీ అయ్యప్ప ఆలయంలో మహిళల ప్రవేశం సహా పలు మతాలకు సంబంధించిన మత స్వేచ్ఛ, మహిళలపై వివక్ష అంశాలపై దాఖలైన పిటిషన్లను తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తున్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనంలో న్యాయమూర్తులు బి.వి. నాగరత్న, ఎం.ఎం. సుందరేశ్, అహ్సనుద్దీన్ అమానుల్లా, అరవింద్ కుమార్, ఆగస్టిన్ జార్జ్ మసీహ్, ప్రసన్న బి. వరాలే, ఆర్. మహాదేవన్, జోయ్మాల్య బాగ్చి సభ్యులుగా ఉన్నారు.
దావూదీ బొహ్రా సమాజాధిపతి తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది నీరజ్ కిశన్ కౌల్, మతపరమైన అంశాల్లో న్యాయస్థానాల పరిమిత జోక్యంపై కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్ రాసిన వ్యాసాన్ని ప్రస్తావించారు.ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ స్పందిస్తూ, ప్రముఖులు, న్యాయవేత్తలు తదితరుల అభిప్రాయాలను మేము గౌరవిస్తాం. కానీ వ్యక్తిగత అభిప్రాయం వ్యక్తిగత అభిప్రాయమే అని అన్నారు. దీనికి కౌల్ స్పందిస్తూ, జ్ఞానం, వివేకం ఎక్కడి నుంచి వచ్చినా స్వాగతించాలి. ఏ దేశం నుంచి వచ్చినా, ఏ విశ్వవిద్యాలయం నుంచి వచ్చినా ఆలోచనలను స్వీకరించాలి. అన్ని రకాల జ్ఞానం, సమాచారాన్ని అంగీకరించేంత గొప్ప నాగరికత మనది అని అన్నారు.
అప్పుడు న్యాయమూర్తి నాగరత్న సరదాగా, కానీ వాట్సాప్ యూనివర్సిటీ నుంచి మాత్రం కాదు అని చమత్కరించారు. దీనిపై కౌల్ స్పందిస్తూ, ఏ విశ్వవిద్యాలయం మంచిదో, చెడ్డదో అన్న చర్చలోకి నేను వెళ్లడం లేదు. ఎక్కడి నుంచి వచ్చినా జ్ఞానం, సమాచారాన్ని స్వీకరించాలన్నదే నా ఉద్దేశం అని తెలిపారు. ఇదిలా ఉండగా, ఒక మత వర్గానికి చెందిన ఆచారం అత్యవసర మతాచారమా కాదా అన్నది నిర్ణయించడం న్యాయస్థానాలకు చాలా క్లిష్టమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 2018 సెప్టెంబర్లో ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం 4:1 మెజారిటీ తీర్పుతో 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలను శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అనుమతించకుండా ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. శతాబ్దాల నాటి ఈ ఆచారం చట్టవిరుద్ధమని, రాజ్యాంగ విరుద్ధమని అప్పట్లో తీర్పు ఇచ్చింది.










