
అమరావతి: ఎంతో భవిష్యత్ ఉన్నగిరిజన బిడ్డ ముర్రం శివాని ఇలా తనువు చాలించడం బాధాకరమని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. కారణాలు ఏమైనా తన కలలు నిజం కాకుండానే విద్యార్థిని దూరమవడం కలచివేస్తోందని అన్నారు. రంపచోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ముర్రం శివాని ఆత్మహత్యపై చంద్రబాబు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పిటిఎం వేదికపై ఉత్సాహంగా మాట్లాడిన శివాని బలవన్మరణం ఆవేదన కలిగించిందని, ఆ రోజు తన చదువు, ఉన్నత లక్ష్యాలపై శివాని చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. శివాని మృతిపై పూర్తి దర్యాప్తు జరపాలని అధికారులను ఆదేశించానని అన్నారు. సమస్యలు, కష్టాలు వచ్చినా విద్యార్థులు, యువత ధైర్యంగా నిలబడాలని సూచించారు. ఎవరూ ఒత్తిడి, నిరాశ, నిస్పృహలకు లోనుకావద్దని కోరుతున్నానని, ఎంతటి సమస్యకైనా పరిష్కారం ఉంటుందని పేర్కొన్నారు. తమ బాధ, ఆవేదనను తమ కుటుంబసభ్యులు, స్నేహితులతో పంచుకొండని, ఒత్తిడిని అధిగమించి తమ కలలను నిజం చేసుకునేలా ముందుకు సాగండని సూచించారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు.











