విద్యుత్ షాక్‌తో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన తల్లాడ మండలం నారాయణపురం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మంపాటి కార్తీక (8) అనే చిన్నారి నారాయణపురం గ్రామంలోని యాదవుల బజారులో కుటుంబంతో కలిసి నివాసం ఉంటోంది. ఇంటి పక్కనే నిర్మాణంలో ఉన్న ఓ భవనం వద్ద ఆటలు ఆడుకుంటూ వెళ్లిన చిన్నారి ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లను తాకడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్ ద్వారా వైరాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా,

అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కార్తీక కుటుంబం స్వస్థలం వైరా మండలం పుణ్యపురం గ్రామం. కొంతకాలం క్రితం చిన్నారి తండ్రి మృతి చెందడంతో, కుటుంబ పోషణ కోసం తల్లి తల్లాడ మండలం నారాయణపురంలో అద్దె ఇంట్లో ఉంటూ ఓ హోటల్‌లో పనిచేస్తోంది. కుమారుడు, కుమార్తె ఇద్దరినీ చదివిస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న సమయంలో ఈ విషాదం చోటుచేసుకోవడంతో ఆకుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.