విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్ ’నాగబంధం - ది సీక్రెట్ ట్రెజర్’. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్, రిషభ్ సావ్నీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జూలై 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా కెమెరామెన్ ఎస్. సౌందరరాజన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. “అభిషేక్ చాలా పెద్ద విజన్‌తో ఈ కథను మొదలుపెట్టారు. నేను స్క్రిప్ట్ స్టేజ్ నుంచే ఈ ప్రాజెక్టులో భాగమయ్యాను. నాగబంధం ఐడియా మా అందరినీ ఎంతగానో ఉత్సాహపరిచింది. మొదట కథను లాక్ చేశాం. తర్వాత దాన్ని విజువల్‌గా ఎంత గ్రాండ్‌గా చూపించాలనే దానిపై ప్లాన్ చేశాం.

ఈ సినిమాలోని వీఎఫ్‌ఎక్స్ అన్నీ కూడా చాలా నేచురల్‌గా, రియల్‌గా ఉంటాయి. -నేను, డైరెక్టర్, ఆర్ట్ డైరెక్టర్ కలిసి చాలా దేవాలయాలు తిరిగాం. తిరువనంతపురంలోని శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయాన్ని సందర్శించాం. అదే ఆలయాన్ని ఆధారంగా చేసుకున్నప్పటికీ సినిమాలో ‘శ్రీరంగపురం‘ అనే పేరు పెట్టాం. శ్రీరంగం, తిరువనంతపురం ప్రాంతాల వైభవాన్ని కలిపేలా ఆ పేరు నిర్ణయించాం. ఆ దేవాలయానికి సంబంధించిన అంశాలపై చాలా రీసెర్చ్ చేశాం. అలాగే ఆర్ట్ డైరెక్టర్ అశోక్ అద్భుతమైన సెట్లు వేశారు. అనంత పద్మనాభస్వామి టెంపుల్ సెట్‌లోకి అడుగుపెడితే నిజంగా ఆలయంలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. అంత అద్భుతంగా ప్రతి సెట్‌ను తీర్చిదిద్దారు.

డైరెక్టర్ అభిషేక్ అద్భుతమైన కథను రాసుకున్నారు. దర్శకుడిగా ఆయన అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. -హైదరాబాద్, కేరళ, తమిళనాడు, అలాగే హిమాలయాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ సినిమాలోని కీలక సన్నివేశాలు చిత్రీకరించాం. హీరో విరాట్ కర్ణ డిసెంబర్, నవంబర్ నెలల్లో తీవ్రమైన చలిలో కూడా అండర్‌వాటర్ సన్నివేశాల్లో పాల్గొన్నారు. జ్వరంతో కూడా షూట్‌కి వచ్చారు. -ఈ సినిమా హైలైట్ అనంత పద్మనాభస్వామి టెంపుల్, అక్కడ జరిగే సన్నివేశాలు. అవి అద్భుతంగా ఉంటాయి. అలాగే క్లైమాక్స్ కూడా ప్రేక్షకులను మైమరపిస్తుంది. మైథాలజీ, ఫిక్షన్, డ్రామా అన్నింటినీ మిళితం చేస్తూ ఒక విజువల్ ఫీస్ట్‌లా ఈ సినిమాను మలిచాం”అని అన్నారు.