బెంగళూరులో ఓవర్‌టేకింగ్‌ విషయంలో జరిగిన వివాదం దాడికి దారితీసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కన్నడ నటుడు దునియా విజయ్‌ కుమారుడు సమ్రాట్‌పై ఓ విద్యార్థిపై దాడి చేసినట్లు ఆరోపణలు నమోదయ్యాయి.

పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. సమ్రాట్‌, అతని స్నేహితులు జిప్సీలో వెళ్తుండగా.. మానిష్‌ గౌడ, అతని స్నేహితులు ఐ20 కారులో వారిని ఓవర్‌టేక్‌ చేశారు. ఆ తర్వాత బెంగళూరులోని మైసూరు రోడ్డులో ఆర్‌వీ యూనివర్సిటీ సమీపంలో మానిష్‌ను సమ్రాట్‌, అతని స్నేహితులు అడ్డుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

మానిష్‌ను బలవంతంగా కారులోకి లాక్కెళ్లి దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనలో గాయపడిన మానిష్‌ ప్రస్తుతం ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఈ ఘటనపై కేంగేరి పోలీసులకు మానిష్‌ ఫిర్యాదు చేయగా.. ఫిర్యాదు అందిందని, ప్రాథమిక వివరాలను పరిశీలించిన తర్వాత ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తామని డీసీపీ తెలిపారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.