బాపట్ల జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2022 ఏప్రిల్ 4 న జరిగిన పునర్వ్యవస్థీకరణలో భాగంగా పాత గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా ప్రాంతాలతో కొత్తగా ఏర్పరచిన జిల్లా. దీని పరిపాలనా ప్రధాన కార్యాలయం బాపట్ల. బాపట్లలో భారతీయ వాయుసేన కేంద్రం, దక్షిణ భారతదేశపు తొలి వ్యవసాయ విద్యాలయంతోపాటు, ఇతర విద్యాలయాలు ఉన్నాయి. ఐదో శతాబ్దం నాటిదైన భావనారాయణ స్వామి ఆలయం, భట్టిప్రోలు స్తూపం జిల్లా లోని చారిత్రక ప్రదేశాలు. బాపట్ల దగ్గర సూర్యలంక సముద్రతీరం, చీరాల దగ్గర ఓడరేవు ప్రముఖ పర్యాటక కేంద్రాలు.







