కొలంబియా పశ్చిమ తీర ప్రాంతాన్ని సోమవారం ఉదయం భారీ భూకంపం కుదిపేసింది. భూకంప ప్రభావంతో రాజధాని బొగోటాలోని భవనాలు బలంగా కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు.
కొలంబియన్ జియోలాజికల్ సర్వీస్ మరియు అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) వివరాల ప్రకారం, ఈ భూకంప కేంద్రం చోకో ప్రావిన్స్లోని శాన్ జోసే డెల్ పాల్మార్ సమీపంలో, బొగోటాకు సుమారు 400 కిలోమీటర్ల దూరంలో ఉంది. భూకంపం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7:34 గంటలకు సంభవించగా, భూకంప తీవ్రతను వివిధ సంస్థలు 6.6 నుంచి 7.4 మాగ్నిట్యూడ్ మధ్యగా నమోదు చేశాయి.
భూకంపం కారణంగా ప్రాంతీయ రాజధాని క్విబ్డోలో పలువురు గాయపడగా, అనేక భవనాలు దెబ్బతిన్నాయి. అధికారులు వెంటనే సహాయక బృందాలను రంగంలోకి దించి, నష్టం అంచనా వేస్తున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో ప్రజలు భవనాల నుంచి బయటకు పరుగులు తీయడం, గోడలు పగిలిపోవడం, రోడ్లపై శిథిలాలు కనిపించడం వంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. భూకంప ప్రకంపనలు వెనిజులా, ఈక్వడార్ దేశాల్లో కూడా స్పష్టంగా నమోదయ్యాయి.
అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, దెబ్బతిన్న భవనాల్లోకి వెళ్లవద్దని, ఆఫ్టర్షాక్స్ (తదుపరి ప్రకంపనలు) వచ్చే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రస్తుతం నష్టం, ప్రాణనష్టం వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.












