నేపాల్‌లో ఘోర వరదల వేళ ఓ హెడ్‌మాస్టర్ తీసుకున్న సెకన్ల నిర్ణయం 1,643 మంది విద్యార్థుల ప్రాణాలను కాపాడింది. ఆగస్టు 26న భారీ వరద ముప్పుపై హెచ్చరిక అందుకున్న వెంటనే.. త్రిభువన్ త్రిశూలి సెకండరీ స్కూల్ హెడ్‌టీచర్ రాజేంద్ర దవాడీ తరగతులను నిలిపివేసి, విద్యార్థులను వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించారు.

స్కూల్‌లో ఉన్న 900 మందికి పైగా విద్యార్థులను కొండపైకి పంపించడంతో పాటు.. మరో 700 మంది విద్యార్థులతో వస్తున్న స్కూల్ బస్సులను కూడా వెనక్కి మళ్లించారు. చివరి బస్సు బ్రిడ్జి దాటిన కొద్దిసేపటికే వరద ఉద్ధృతంగా వచ్చి ఆ వంతెనను కొట్టుకుపోయింది.

కేవలం 10 నిమిషాల తర్వాత భారీ వరద నీరు, బురద స్కూల్‌ను పూర్తిగా ధ్వంసం చేశాయి.
“వరద రాకపోతే ఒక రోజు చదువు పోతుంది.. కానీ వరద వస్తే ప్రాణాలే పోతాయి” అంటూ రాజేంద్ర దవాడీ తీసుకున్న నిర్ణయం.. వందలాది కుటుంబాల్లో విషాదాన్ని తప్పించింది.