జోగిపేట: ముక్కుపచ్చలారని పసికందును కన్నతండ్రే దారుణంగా హతమార్చిన ఘటన సంగారెడ్డి జిల్లా జోగిపేటలో చోటు చేసుకుంది. సిఐ అనిల్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. జోగిపేట పట్టణానికి చెందిన కృష్ణ, గౌరమ్మ దంపతులు పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం కూడా తన భార్యతో గొడవపడిన కృష్ణ.. పాలు తాగుతున్న బిడ్డను లాక్కొని.. చిన్నారి చెంపలపై కొట్టాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించింది. దీంతో కోపోద్రిక్తుడైన కృష్ణ.. చేతిలో ఉన్న పసికందును నేలకేసి కొట్టాడు. గౌరమ్మ గట్టిగా కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయాడు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న పసికందును జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. కృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.