షిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. లాహౌల్-స్పితి జిల్లాలో ఓ వాహనంపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. పంగీ-కిలాద్ రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

కుల్లు నుంచి పంగీ వైపు వెళ్తున్న టాటా సుమోపై ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో వాహనం వెనుక భాగంలో మంటలు తలెత్తాయి. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం సమయంలో వాహనంలో 15 మంది వరకు ఉన్నట్లు సమాచారం. పెద్ద పెద్ద బండరాళ్లు పడటంతో వాహనం నుజ్జునుజ్జయింది.

పంగీ-కిలాద్ రోడ్డులో గురువారం కూడా కొండచరియలు విరిగిపడటంతో ఈ మార్గాన్ని మూసివేశారు. మరమ్మతుల అనంతరం ఈ ఉదయమే రాకపోకలను పునరుద్దరించారు. ఈ క్రమంలోనే నేడు మళ్లీ కొండచరియలు విరగడంతో ఈ విషాదం చోటు చేసుకుంది. వాహన శిథిలాల కింద తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తిని కాపాడి ఆసుపత్రికి తరలించారు.