
కొచి : కొచ్చి కేంద్రంగా ఉన్న సిఎంఆర్ఎల్ (కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటైల్ లిమిటెడ్ )కు వ్యతిరేకంగా నమోదైన మనీలాండరింగ్ కేసులో కంపెనీ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎన్ శశిధరన్ కర్తా కేరళ మాజీ సిఎం పినరయి విజయన్ కుమార్తె వీణా టికి అక్రమంగా నిధులు చెల్లించినట్టు అంగీకరించారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన నివేదికలో వెల్లడించింది. ఈ నివేదికను శనివారం న్యాయనిర్ణయాధికార సంస్థకు సమర్పించింది. నిందితుడి ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ఈడీ తన నివేదికలో కోరింది. మాజీ సిఎం పినరయి విజయన్తో ఆమెకున్న వ్యక్తిగత సంబంధం వల్లనే ఈ చెల్లింపులు జరిగినట్టు మాజీ ఎండీ అంగీకరించారని పేర్కొంది. సిఎంఆర్ఎల్ అక్రమ లావాదేవీల్లో వీణా టి ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు రావడంతో కంపెనీల చట్టం ఉల్లంఘన కింద అభియోగాలు నమోదయ్యాయి.
మాజీ సిఎం పినరపి విజయన్ కుమార్తె వీణాకు, సిఎంఆర్ఎల్కు మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలపై ఈడీ దర్యాప్తు జరుపుతోంది. విజయన్ కుమార్తె వీణా టి ఎక్స్లాజిక్ సొల్యూషన్స్ ప్రైవేట్ సంస్థను నిర్వహిస్తున్నారు. ఆ సంస్థకు సిఎంఆర్ఎల్ సంస్థ ఎలాంటి సేవలు అందించకుండానే దాదాపు రూ. 2.78 కోట్ల మొత్తం ముందస్తు చెల్లింపులు జరిపిందని ఈడీ పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం సీఎంఆర్ఎల్ సంస్థాపకుడు, మాజీ ఎండీ అయిన శశిథరన్ కస్తా దాదాపు 15 సంవత్సరాల కాలంలో రూ. 182 కోట్లు నిధుల దుర్వినియోగం చేయడానికి ఒక రహస్య పథకాన్ని రూపొందించారని ఆరోపించింది.
ఈ బాగోతంలో ఎలాంటి సేవలు అందించకుండానే సరైన బిల్లులు లేకుండానే స్వయంగా సృష్టించుకున్న రశీదులతో మురుగు, చెత్త నిర్వహణ, రవాణా ఖర్చుల కింద రూ. 139 కోట్ల బూటకపు నగదు ఖర్చులను చూపించారని నివేదికలో బయటపెట్టారు. మిగతా రూ. 43 కోట్లు వెండర్లు (వ్యాపార భాగస్వాములు) ద్వారా పక్కదారి పట్టించారు. ఆ వెండర్లు అదనపు మొత్తాన్ని నగదు రూపంలో డ్రా చేసుకుని తమ కమిషన్లు మినహాయించుకుని మిగతా మొత్తాన్ని సిఎఆర్ఎల్ అధికారులకు తిరిగి చెల్లించారని తేలింది. రూ. 2.78 కోట్లు బోగస్ ఖర్చుల కింద సాఫ్ట్వేర్ సర్వీసెస్ పేరున వీణాకు ఆమె కంపెనీకి ఎలాంటి సర్వీసులు లేకుండా సిఎంఆర్ఎల్ చెల్లించిందని నివేదిక పేర్కొంది. 2023 ఆగస్టులో ఈ అంశం వెలుగు లోకి రావడంతో సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ కొచ్చి కోర్టులో ఫిర్యాదు దాఖలు చేయడంతో ఈడీ దర్యాప్తు చేపట్టింది.








