ఎంఎల్‌ఎ గంగుల క్యాంప్ ఆఫీస్‌పై బిజెపి

శ్రేణుల దాడి పాడి కౌశిక్‌రెడ్డి కారు ధ్వంసం

గంగుల క్యాంప్ ఆఫీస్‌లో జరిగిన మీడియా

సమావేశంలో కేంద్రమంత్రి బండిపై పాడి

తీవ్ర వ్యాఖ్యలు ఆగ్రహించి దాడికి దిగిన

బిజెపి నాయకులు రేపు కరీంనగర్ బంద్‌కు

బిఆర్‌ఎస్ పిలుపు ఇది దుర్మార్గమైన చర్య

బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్

మన తెంలగాణ/ఉమ్మడి కరీంనగర్ బ్యూరో: కరీంనగర్‌లో బీజేపీ శ్రేణులు రెచ్చిపోయారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపాఫీస్‌పై కర్రలు, రాడ్లతో దాడి చేశారు. కిటికీల అద్దాలు పగులగొట్టారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ప్రెస్‌మీట్ ముగిసిన 10 నిమిషాలకే బీజేపీ నాయకులు, కార్యకర్తలు దాడికి పాల్పడి కౌశిక్‌రెడ్డి వాహనం ధ్వంసం చేశారు. కౌశిక్‌రెడ్డిపై సైతం దాడికి యత్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రి బండి సంజయ్ ఇద్దరు కలిసే నాపై హత్యా ప్రయత్నం చేశారని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. కరీంనగర్‌లో తనపై, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపాఫీస్‌పై కర్రలు, రాడ్లతో దాడిచేశారని తెలిపారు.

తాను ఎవరిపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదని, తెలంగాణలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందన్నందుకే దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. బండి సంజయ్ అన్న మాటలకే కౌంటర్ ఇచ్చానే తప్పా, నేను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. కేంద్రమంత్రి కేటీఆర్ డ్రగ్స్ తీసుకున్నారని, ఓ అమ్మకు అబ్బకు పుట్టినవారైతే చర్చలకు రావాలని బండి సంజయ్ మాట్లాడటం ఎంతవరకు సమంజసమన్నారు. తనపై దాడి చేసిన వారంతా రౌడీ షీటర్లేనని తెలిపారు. దాడిపై మర్డర్ కేసు నమోదు చేయాలన్నారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయంపై దాడి జరుగుతుంటే కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఏం చేస్తున్నాడని ప్రశ్నించాడు. ఓ ఎమ్మెల్యేపై కర్రలు, కత్తులతో దాడికి పాల్పడితే సామాన్యుల పరిస్థితి ఏమిటని పాడి ప్రశ్నించారు. ప్రాణాలు పోయినా పోరాటం ఆపమన్నారు.

చంపుతామని బెదిరించడమేంటి..? : కౌశిక్‌రెడ్డి

‘నాపై రెక్కీ నిర్వహిస్తున్నారు. చంపుతారని ముందే చెప్పా. కర్రలు, కత్తులు, పెట్రో బాంబులతో దాడిచేశారు. కరీంనగర్‌లో గన్‌కల్చర్ తెచ్చారు, ఇది మంచి పద్ధతి కాదనే నేను మాట్లాడాను. దొంగలను ఎందుకు పట్టుకోలేని నేను అడిగితే నాపై దాడి చేశారు. యూపీ నుంచి దోపిడీ దొంగలు, హంతకులు వస్తుంటే ఏం చేస్తున్నారు? మేమేం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదు. ఈ దాడులేంటి..? చంపుతామని బెదిరించడమేంటి? ఇదేం పద్ధతి’ అని పాడి కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు. ‘బండి సంజయ్.. నీకు దమ్ము, ధైర్యం ఉంటే చర్చకు రా. కరీంనగర్ గీతాభవన్ చౌరస్తాలో చర్చకు మేము సిద్ధం. కరీంనగర్ గడ్డ మీది నుంచి నేను సవాల్ విసురుతున్నా.. సమయం నువ్వే చెప్పు, రావడానికి మేము రెడీ..

ఇరిగేషన్, ఐటీ, సివిల్ సప్లై... ఇలా ఏ సబ్జెక్ట్ మీదైనా సరే కెటిఆర్ వస్తారు. అర్థం పర్థం లేని విమర్శలు మానేసి చర్చకు వచ్చే ధైర్యం ఉందా?’ అని పాడి కౌశిక్ రెడ్డి సవాలు విసిరారు. మీరు సబ్జెక్ట్ మాట్లాడకుండా మమ్మమ్మే, తత్తత్తే, బెబ్బెబ్బే అంటే కుదరదు బండి సంజయ్ అని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ కార్యాలయంపై జరిగిన దాడి ఘటనపై మాజీ మేయర్, సర్దార్ రవీందర్‌సింగ్ పోలీస్‌స్టేషన్‌లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కక్షలతో కార్యాలయాలపై దాడులు చేయడం, వాహనాలను ధ్వంసం చేయడం, కార్యకర్తల్లో భయాందోళనలు సృష్టించడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. కరీంనగర్‌లో జరుగుతున్న ఘటనలు చూస్తుంటే గుండాయిజం, రౌడీయిజం పెరుగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు.

దాడిలో పలువురికి గాయాలు:

కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై బీజేపీ శ్రేణులు చేసిన దాడిలో పలువురికి గాయాలయ్యాయి. గాయాలైనవారిని జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బీఆర్‌ఎస్ నాయకులు దూలం సంపత్ తలకు తీవ్రం గాయాలయ్యాయి. బీజేపీ శ్రేణులు చేసిన దాడి ఘటనపై గురువారం సాయంత్రం కరీంనగర్‌లోని టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో బీఆర్‌ఎస్ నాయకులు సర్దార్ రవీందర్‌సింగ్, నారదాసు లక్ష్మణ్‌రావు, చల్ల హరిశంకర్‌లు ఫిర్యాదు చేశారు. మరోవైపు హుజూరాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. క్యాంపు కార్యాలయంలోకి వెళ్లడానికి ప్రయత్నించిన బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. కర్రలు విసురుకున్న కార్యకర్తలను పోలీసులు స్టేషన్‌కు తరలించారు.

రేపు బంద్‌కు బీఆర్‌ఎస్ పిలుపు:

కరీంనగర్‌లో ఎమ్మెల్యే క్యాంపాఫీస్‌పై, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి కారుపై కర్రలు, రాడ్లతో దాడి చేయడం అ త్యంత హేయనీయమని కరీంనగర్ బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు అన్నారు. ఈ దాడిని ఖండి స్తూ ఆయన శనివారం నగర బంద్‌కు పిలుపునిచ్చారు.