
కుటుంబ కలహాలు, అనారోగ్య సమస్యలతో సూసైడ్ నోట్ రాసి దంపతులు మృతిచెందిన సంఘటన సూర్యాపేట జిల్లా తిర్మలగిరి మున్సిపాలిటి కేంద్రంలో జరిగింది. ఎస్ఐ వెంకట్రెడ్డి, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. తిర్మలగిరి మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన దంపతులు వడియాల శ్రీనివాస్ (59) భార్య వడియాల జ్యోతి (52) మున్సిపాలిటీ కేంద్రంలో కిరాణా షాపు నడిపిస్తూ జీవనం పొందుతున్నారు. అనారోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు, అప్పుల భాధతో మనస్థాపం చెంది తన సొంత ఇంట్లో రెండు ఫ్యాన్లకు ఉరి వేసుకొని ఒకేసారి దంపతులు మృతి చెందారు.
ఈ విషయం శుక్రవారం ఉదయం ఆరు గంటలకు తన కుమారుడు వడియాల శ్రావన్ ఇంటికి వెళ్లి చూడగా రెండు ఫ్యాన్లకు తల్లిదండ్రులు చనిపోయి వేలాడుతూ కనిపించారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో పాటు ఇంట్లో కూడా తరచూ గొడవలు జరుగుతున్నాయన్నారు. సంఘటనా స్థలానికి ఎస్ఐ వెంకట్రెడ్డి, పోలీస్ సిబ్బంది చేరుకొని వివరాలు సేకరించగా సూసైడ్ నోట్ బయటపడింది. ఈ విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ దంపతులకు కొడుకు, కూతురు ఉన్నారు.











