
నర్సంపేట: వరంగల్ జిల్లా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. ఆదివారం తెల్లవారుజామున పెద్ది సుదర్శన్ గుండెపోటు తో చనిపోయారని కుటుంబ సభ్యులు తెలిపారు. సుదర్శన్ రెడ్డికి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వెంటనే ఆయన ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన గుండెపోటుతో మృతి చెందారని పరీక్షించిన వైద్యులు తెలిపారు. ఆయన మృతి పట్ల మాజీ సిఎం కెసిఆర్, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, బిఆర్ఎస్ నేతలు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మరణ వార్త తెలిసిన వెంటనే కెటిఆర్ వరంగల్ కు ప్రయాణమయ్యారు. 2019 అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున నర్సంపేట శాసనసభ నియోజకవర్గం నుండి ఎంఎల్ఎగా గెలిచారు. తెలంగాణ పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్గా సేవలందించారు.
వరంగల్ గ్రామీణ జిల్లా నల్లబెల్లి మండలంలోని నల్లబెల్లి గ్రామంలో 1974 ఆగస్టు 6న రాజిరెడ్డి అమృతమ్మ అనే దంపతులకు సుదర్శన్ జన్మించారు. 1991లో వరంగల్ లోని మహబూబియా పంజాథన్ కాలేజీ నుండి ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. నల్లబెల్లి మండల యూత్ అధ్యక్షుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, దుగ్గొండి మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షునిగా కొనసాగుతూ అనంతరం 2001లో కెసిఆర్ ఏర్పాటుచేసిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి రైతు నాగలి గుర్తుపై నల్లబెల్లి మండల జెడ్పిటిసి గా గెలుపొంది జెడ్పీ ఫోర్ లీడర్ గా కొనసాగారు.
2004 డిసెంబర్ లో జిల్లా పార్టీ కన్వీనర్, 2005 చివర్లో రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా ఎన్నిక కావడం జరిగింది. తదనంతరం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా ఎనిమిది సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీకి, వరంగల్ జిల్లా ఉద్యమానికి సారథ్యం వహించారు. తర్వాత 2006 నుండి 2014 వరకు జిల్లా పార్టీ పొలిటికల్ బ్యూరో సభ్యునిగా పనిచేస్తూ.. కెసిఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితులుగా, ఉద్యమ నేతగా అనతి కాలంలోనే రాష్ట్రస్థాయిలో రాజకీయ నేతగా గుర్తింపును పొందారు. మహాగర్జన లాంటి చారిత్రాత్మకమైన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సభలు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలోని జరిగాయి.
తెలంగాణ ఉద్యమ కాలంలో వరంగల్ జిల్లా కేంద్రంగా జరిగిన అన్ని సభలకు పెద్ది సుదర్శన్ రెడ్డి ముందుండి నడిపించారు. తర్వాత 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి సమీప స్వతంత్ర అభ్యర్థి దొంతి మాధవ రెడ్డి చేతిలో 18,376 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పై పోటీచేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దొంతి మాధవ రెడ్డిపై 16,949 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తర్వాత ఆయన 2018లో శాసనసభలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా కూడా సేవలందించారు.











