
ఈ నెల 21నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. బిజెపి నేతృత్వంలోని ఎన్డిఎ ఈసారి ఇదివరకటి రాజకీయ స్థితి కన్నా బలమైన రాజకీయ స్థాయితో ఈ సమావేశాలకు సిద్ధమవుతోంది. ఇటీవల పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తరువాత రాజకీయ పునర్నిర్మాణం జరిగి లోక్సభలో పొత్తుల బలం పెరిగింది. దీంతో పార్లమెంట్లో తమ కార్యకలాపాలకు అంతగా ప్రతిఘటన ఉండకపోవచ్చన్న ధీమా ఎన్డిఎలో కనిపిస్తోంది. కానీ సభ్యుల సంఖ్య ఒక్కటే పాలనా సామర్ధానికి గ్యారంటీ ఇవ్వదు. అధికార పార్టీకి ఎంతబలం ఉన్నప్పటికీ ప్రజాసమస్యలపై సజావుగా చర్చలు జరిగి, ప్రయోజనకరంగా చట్టాలను రూపొందించేలా పార్లమెంట్ను నిర్వహించినప్పుడే ప్రజలకు ఉపయోగం ఉంటుంది. ఎప్పటిలాగే రానున్న సమావేశాలు కూడా నినాదాల హోరుతో, అంతరాయాలతో, రాజకీయ నాటకంతో ముగిస్తే చివరకు నష్టపోయేది ప్రజలే. ప్రతి చిన్న విషయానికీ వాదించుకుని సభను వాయిదా వేయించడానికి పార్లమెంట్ను యుద్ధభూమిగా మార్చాలని అనుకోకూడదు. జాతీయ స్థాయిలో ప్రయోజనాలు సిద్ధించేలా చర్చలు సాగించడం, జవాబుదారీతనం ప్రదర్శించడం, చట్టాలు రూపొందించడం ఇవన్నీ నెరవేర్చగలిగే అత్యున్నత వ్యవస్థే పార్లమెంట్.
గత దశాబ్దాల్లో వాజ్పేయ్, చంద్రశేఖర్, సోమనాథ్ చటర్జీ, ఇంద్రజిత్ గుప్తా, హెచ్ఎన్ బహుగుణ, మూలాయం సింగ్ యాదవ్ వంటి ఉత్తమ పార్లమెంటేరియన్లు ఉన్నప్పుడు పార్లమెంట్ సమావేశాలు ఎంత గౌరవప్రదంగా జరిగాయో, ఇప్పుడెలా జరుగుతున్నాయో గమనిస్తే చాలా ఆవేదన కలుగుతుంది. వాజ్పేయ్, బహుగుణ, సోమనాథ్ ఛటర్జీ వంటి నేతలు తీవ్రమైన రాజకీయ ప్రత్యర్థులే అయినప్పటికీ, పార్లమెంట్ గౌరవాన్ని కాపాడే బాధ్యత తమదేనన్న ఉదాత్తమైన బాధ్యతను ఎన్నడూ మర్చిపోలేదు. ప్రశ్నోత్తరాల సమయాన్ని, జీరో అవర్ సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా చర్చలు సాగించేవారు. సభ్యులు వాస్తవాల పరిశీలనతో, గణాంకాలతో సభలో చర్చించేవారు. తీవ్ర వాగ్వివాదాలు జరిగినా గందరగోళానికి దారితీయకుండా సభను సాగించేవారు. ఏదైనా అంశంపై చర్చ జరుగుతున్నప్పుడు స్పీకర్ జోక్యం చేసుకుని వారిస్తే సంయమనం పాటించేవారు. వాకౌట్లను అరుదుగా వాడేవారు. దేనిమీదైనా తమ నిరసన తెలిపినా, లేదా అభ్యంతరం తెలిపినా తరువాత సభనుంచి బయటకు వెళ్లిపోయేవారు. దీనివల్ల సభా కార్యక్రమాలకు ఎలాంటి అంతరాయం కలిగేది కాదు. దీనికి భిన్నంగా ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈసారి ప్రభుత్వ బలం పెరగడం వల్ల వారి చట్టపరమైన ప్రణాళికల గురించి, సహజంగానే చర్చలు జరుగుతాయని, అంచనా వేస్తున్నారు.
నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), అవసరాలకు అనుగుణంగా రాజ్యాంగం లోని చట్టాల్లో మార్పులు చేయడం, చట్టసభల్లో మహిళలకు 33శాతం సీట్లు కేటాయించడం, మతంతో సంబంధం లేకుండా దేశంలోని పౌరులందరికీ ఒకే విధమైన ఉమ్మడి పౌరస్మృతి అమలు.. అంటే వివాహం, విడాకులు, ఆస్తి హక్కులు మొదలైన అంశాల్లో ఒకే విధమైన పౌరచట్టాలను అమలు లోకి తీసుకురావడం.. వంటి వివాదాస్పద అంశాలను ఈసారి పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టడానికి ఎన్డిఎ ప్రభుత్వం సిద్ధమైంది. ఈమేరకు రాజ్యాంగ సవరణలకు ఆమోదం కావాలంటే సభ్యుల్లో మూడింట రెండొంతుల మెజారిటీ తప్పనిసరి. ఉదాహరణకు 300 మంది సభ్యులు సమావేశాలకు హాజరైతే వారిలో 200 మంది బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలి. ఓటింగ్ సమయంలో ఎంతమంది సభ్యులు సభలో భౌతికంగా ఉన్నారో, సభలో ఉన్నప్పటికీ బిల్లుకు అనుకూలంగా లేదా ప్రతికూలంగా ఉన్నారో, ఓటువేయకుండా తటస్థంగా ఉండిపోవడం ఇవన్నీ పరిగణిస్తారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం తనకున్న బలంతో తన ప్రయోజనాలను గరిష్టంగా నెరవేర్చుకోగలదన్న నమ్మకంతో ఉంది. ఇక విపక్షాల సంగతి పరిశీలిస్తే సభలో ప్రవేశపెట్టనున్న బిల్లుల్లో చాలావరకు వివాదాస్పదమైనవే ఉన్నందున గట్టిగా చర్చించి ప్రభుత్వాన్ని నిలదీయాలన్న పట్టుదలతో వ్యూహాలు రూపొందించుకుంటున్నాయి. నీట్ పరీక్ష ప్రశ్నపత్రాల లీక్, అయోధ్య విరాళాల దోపిడీ అంశాలను ప్రధానంగా సభలో లేవనెత్తే పరిస్థితి కనిపిస్తోంది.
ఈ రెండు అంశాలూ సభలో తప్పకుండా చర్చించవలసినవే. చర్చకు సరైన సమాధానం ఇవ్వకుండా ప్రభుత్వం తప్పించుకోవడానికి వీలులేదు. అలా జరిగితే ప్రజలకు జవాబుదారీ కాలేదు. అయితే ఈ అంశాలపై నిర్ణీత విధానంతో చర్చిస్తారా? లేదా కేవలం వ్యతిరేక పక్షాల మధ్య కేకలతో గడిపేస్తారా? అనేది ఇప్పుడు ప్రశ్న.నీట్ ప్రశ్నపత్రాల లీక్పై కాంగ్రెస్ మొదట్లో ఉద్యమాన్ని సాగించి ప్రజల మద్దతును పొందగలిగింది. అయితే తరువాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలమైన ఉద్యమాన్ని నిర్మించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిందన్న విమర్శ వస్తోంది. నీట్ ఎగ్జామ్ విషయంలో పొరపాట్లను సవరించామని సర్దుకుపోయే ధోరణి బిజెపి అవలంబించరాదు. కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలన్న డిమాండ్లుపట్ల ప్రభుత్వం ఉదాసీనత చూపిస్తోంది. కాక్రోచ్ జనతా పార్టీ సభ్యుల నిరసన కానీ, వాంగ్చుక్ నిరాహార దీక్ష విషయంలో కానీ ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించలేదన్న ప్రజాగ్రహం కనిపిస్తోంది. ఇది పార్లమెంట్ సమావేశాలను కుదిపివేస్తాయి. విపక్ష సభ్యులు దీనిపై లేవనెత్తనున్న ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా దాటవేసే ధోరణి అనుసరిస్తే పార్లమెంట్ సమావేశాలు కేవలం టెలివిజన్ ప్రసార కార్యక్రమాలుగానే మిగిలిపోతాయి.











