మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రం నుంచి బియ్యం సేకరణను మరో 8 లక్షల మెట్రిక్ టన్నులు (12 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం) పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ హర్షం చేశారు. తెలంగాణ రైతుల మేలు కోసం, తమ పార్టీ ప్రజాప్రతినిధుల విజ్ఞప్తికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకోవడం సంతోషకరం అని వారు వేర్వేరు ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో కేంద్రం కొనుగోలు చేసే బియ్యం నలభై మూడు లక్షల మెట్రిక్ టన్నులకు చేరడం గమనార్హం. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2025-26కు సంబంధించి,సీజన్ ప్రారంభానికి ముందే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల సమక్షంలో తెలంగాణ

నుంచి 35 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం (52 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం) సేకరించాలని సంయుక్తంగా నిర్ణయించడం జరిగింది. కాగా, రాష్ట్రంలో ఈసారి ధాన్యం ఉత్పత్తిని దృష్టిలో పెట్టుకుని, తెలంగాణకు చెందిన బిజెపి ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి ఈ నెల 8 కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ప్రజాపంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సమావేశమై తమ రాష్ట్రం నుంచి బియ్యం సేకరణ పరిమాణాన్ని పెంచాలని విజ్ఞప్తి చేసినట్లు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. తమ విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం, బియ్యం సేకరణ లక్ష్యాన్ని 35 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 43 లక్షల మెట్రిక్ టన్నులకు (అంటే 64 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యానికి సమానం) పెంచుతూ నిర్ణయం తీసుకుందని ఆయన వివరించారు.

రాష్ట్రంలోని రైతుల పరిస్థితులను అర్థం చేసుకుని బియ్యం సేకరణ పెంపు నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోడీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అదేవిధంగా తమ విజ్ఞప్తికి వెంటనే స్పందించి సానుకూల నిర్ణయం తీసుకునేలా సహకరించిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.తెలంగాణకు 8 లక్షల మెట్రిక్ టన్నుల అదనపు బియ్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించడాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన కమిట్‌మెంట్‌కు అనుగుణంగా బియ్యాన్ని సేకరించి భారత ఆహార సంస్థకు సకాలంలో అందజేయాలని ఆయన సూచించారు. ఇప్పటికే, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉన్న బియ్యాన్ని గత మార్కెటింగ్ సీజన్లలో నిర్ణీత గడువులో ఎఫ్‌సిఐకి ఇవ్వలేదని, కాబట్టి గతంలో అంగీకరించిన పరిమాణంలో బియ్యాన్ని ఎఫ్‌సిఐకి అప్పగించలేక రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెంది పలుమార్లు బియ్యాన్ని ఎఫ్‌సిఐకి ఇవ్వడానికి అదనపు గడువు కోరుతూ కాలయాపన చేస్తున్నదని ఆయన విమర్శించారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతమైన ప్రణాళికతో ముందుకు సాగి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్లు పూర్తి చేసి, కేంద్రానికి ఇచ్చిన లక్ష్యాలను నిర్ణీత గడువులో పూర్తి చేసి గతంలో ఇచ్చిన బియ్యం కోటాను విధిగా ఎఫ్‌సిఐ అందజేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.


రాష్ట్ర ప్రభుత్వానికి గుడ్ న్యూస్

రబీ సీజన్‌కు సంబంధించి అదనంగా 8 లక్షల మెట్రిక్ టన్నులు (బియ్యం రూపంలో) సేకరించేందుకు కేంద్రం ఆమోదం తెలపడంపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వాహనాల స్థాన నిర్ధారణను 2026 సెప్టెంబర్ 30 లోపు పూర్తిగా అమలు చేయాలని కేంద్రం నిర్ధారించినట్లు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌లో ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని మంత్రి బండి కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

==ః==