
నేటి 5 నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్, డెంటల్ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఎంబిబిఎస్, బిడిఎస్ కోర్సుల్లో కాంపిటెంట్ అథారిటీ కోటా (కన్వీనర్ కోటా) సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం (కెఎన్ఆర్యుహెచ్ఎస్) ప్రవేశాల నోటిఫికేషన్ను విడుదల చేసింది. నీట్ యుజి -2026 పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు బుధవారం(ఆగస్టు 5) ఉదయం 6 గంటల నుంచి ఆగస్టు 12 సాయంత్రం 6 గంటల వరకు tsmedadm.tsche.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని యూనివర్సిటీ సూచించింది సీట్ల మ్యాట్రిక్స్ను వెబ్ ఆప్షన్లకు ముందు ప్రత్యేకంగా ప్రకటిస్తామని పేర్కొంది.
అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకునే ముందు ప్రాస్పెక్టస్ను పూర్తిగా చదివి, అర్హతలు, రిజర్వేషన్లు, అవసరమైన ధ్రువపత్రాలు, నిబంధనలను పరిశీలించి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని విశ్వవిద్యాలయం తెలిపింది. పూర్తి వివరాలు, సమాచారం కోసం www.knruhs.telangana.gov.in వెబ్సైట్ను ఎప్పటికప్పుడు పరిశీలించాలని కోరింది.
విద్యార్థులకు ముఖ్యమైన సూచనలు
ఆన్లైన్ దరఖాస్తుతో పాటు అన్ని సర్టిఫికెట్లను తప్పకుండా అప్లోడ్ చేయాలి.
నమోదు ప్రక్రియ ఒక్కసారి మాత్రమే ఉంటుంది. ప్రతి రౌండ్ కౌన్సెలింగ్కు మళ్లీ సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు.
సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం తాత్కాలిక మెరిట్ జాబితా విడుదల చేస్తారు.
అనంతరం వెబ్ ఆప్షన్లు, కౌన్సెలింగ్ షెడ్యూల్, సీట్ల మ్యాట్రిక్స్ను కెఎన్ఆర్యుహెచ్ఎస్ వెబ్సైట్లో ప్రకటిస్తారు.
వెబ్ ఆప్షన్లు ఇచ్చేటప్పుడు కళాశాలల ప్రాధాన్యత క్రమాన్ని జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలని విశ్వవిద్యాలయం సూచించింది.











