నిరసన తెలిపిన విద్యార్థులపై జరిగిన హింసకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ ఘటనపై పార్లమెంట్‌కు వచ్చి వివరణ ఇచ్చే ధైర్యం కూడా ఆయనకు లేదని తీవ్ర విమర్శలు చేశారు.పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారంపై అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గత నెల ఆందోళన చేపట్టిన విద్యార్థుల బృందాన్ని రాహుల్ గాంధీ బుధవారం కలిశారు. జూలై 20న జరిగిన నిరసన సందర్భంగా పోలీసులు తమపై అతిగా బలప్రయోగం చేశారని విద్యార్థులు ఆరోపించిన విషయం తెలిసిందే. సోనియా గాంధీ నివాసం 10, జనపథ్‌లో విద్యార్థులతో సమావేశమైన అనంతరం రాహుల్ మీడియాతో మాట్లాడుతూ, దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన యువతతో మాట్లాడినట్లు తెలిపారు. రాజ్యాంగం, విద్యా వ్యవస్థ, దేశ భవిష్యత్తు కోసం పోరాడిన వేలాది మంది విద్యార్థులపై తనకు గర్వంగా ఉందన్నారు.


విద్యార్థులు తనతో మాట్లాడినప్పుడు తమపై దాడులు జరిగాయని, కొట్టారని, బెదిరించారని చెప్పారని రాహుల్ తెలిపారు. వారు రాజ్యాంగాన్ని, భారతదేశ ఆలోచనను, దేశ భవిష్యత్తును కాపాడేందుకు నిలబడ్డారని పేర్కొన్నారు. దేశంలోని విద్యా వ్యవస్థలో లోపాలు ఉన్నాయని చెప్పడం నేరం కాదని రాహుల్ అన్నారు. ప్రస్తుతం విద్యా వ్యవస్థ క్షీణించిందని, దానిలో సంస్కరణలు అవసరమని విద్యార్థులు మాత్రమే కోరారని చెప్పారు. వారు ఎలాంటి హింసకు పాల్పడలేదని, దౌర్జన్యానికి దిగలేదని, అయినప్పటికీ వారిపై దాడులు చేసి, బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. 15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణ చెప్పించడం, కొందరు గూండాలను పంపించి విద్యార్థులపై ఒత్తిడి తేవడం పూర్తిగా ఆమోదయోగ్యం కాదని రాహుల్ విమర్శించారు.

దేశంలో సమర్థవంతమైన విద్యా వ్యవస్థ ఉండాలని, పరీక్షా పత్రాల లీకేజీలకు అడ్డుకట్ట పడాలని, యువత భవిష్యత్తుకు రక్షణ కల్పించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా అమిత్ షాపై నేరుగా విమర్శలు గుప్పించిన రాహుల్, విద్యార్థినిపై పెల్లెట్ గన్ ప్రయోగానికి, మరో విద్యార్థిపై జరిగిన బలప్రయోగానికి, మహిళా విద్యార్థులపై పోలీసులను ప్రయోగించడానికి బాధ్యుడు అమిత్ షానేనని ఆరోపించారు. ఈ ఘటనపై పార్లమెంట్‌కు వచ్చి మాట్లాడే మర్యాదా, ధైర్యం ఆయనకు లేదు. రెండు అవకాశాలు మాత్రమే ఉన్నాయి. విద్యార్థులపై హింస జరిగిందనే విషయం ఆయనకు తెలియకపోతే, హోంమంత్రిగా ఆయన అసమర్థుడు. ఒకవేళ తెలిసే ఆదేశాలు ఇచ్చి ఉంటే, ఆ హింసకు నేరుగా బాధ్యుడు. ఏ పరిస్థితిలోనైనా బాధ్యత అమిత్ షాదే అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.