
సుమంత్ హీరోగా ఈవిన్ నిర్మాణంలో తెరకెక్కిన యూనిక్ థ్రిల్లర్ ‘న్యూటన్స్ థర్డ్ లా’. రాజేశ్ కర్ణ దర్శకత్వం వహించిన చిత్రాన్ని కె.హరీశ్ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 31న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ వేడుకకు హీరో అడివి శేష్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరో అడివి శేష్ మాట్లాడుతూ ‘ న్యూటన్స్ థర్డ్ లా ట్రైలర్ చాలా నచ్చింది. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ లా అనిపిస్తోంది. సుమంత్ నా ఫేవరెట్ బ్రో. జగపతి బాబు చాలా స్టైలిష్గా కనిపించారు ‘అని అన్నారు. హీరో సుమంత్ మాట్లాడుతూ ‘రాజేష్ ఈ కథ చెప్పిన వెంటనే ఓకే చేశాను. ఈ సినిమాలో హీరో స్క్రీన్ప్లే. ఇందులో ప్రతి క్యారెక్టర్కు ప్రాధాన్యత ఉంది. ప్రతి పాత్రకు కథను మలుపు తిప్పే అవకాశం ఉంటుంది. ఇది ఫ్యామిలీ ఆడియన్స్ను కూడా ఆకట్టుకుంటుంది‘అని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయి కృష్ణ, కంటెంట్ హెడ్ భరణ్, నిర్మాత హరీష్, దర్శకుడు రాజేష్ కర్ణ, సింజిత్ తదితరులు పాల్గొన్నారు.











