స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఆర్బిటల్- క్లాస్ ప్రయోగ వాహనం విక్రమ్-1ను విజయవంతంగా పరీక్షించిన స్కైరూట్ ఏరోస్పేస్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. మిషన్ ఆగమన్‌లో భాగంగా నిర్వహించిన విక్రమ్-1 టెస్ట్ ఫ్లైట్-1 విజయం సాధించడం భారత అంతరిక్ష రంగ చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టమని, తెలంగాణకు గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌కు చెందిన స్పేస్-టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ సాధించిన ఈ విజయం దేశం అంతరిక్ష సాంకేతిక రంగంలో సాధిస్తున్న పురోగతికి నిదర్శనమన్నారు. అంతరిక్ష అన్వేషణలో భారత యువ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, ఆవిష్కర్తల ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పే ఘనత స్కైరూట్‌కు దక్కిందని ఆయన ప్రశంసించారు.