తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి

ఎంపీలు పార్లమెంటుకు వెళ్ళినా సమీక్షించాల్సిందే

‘సర్’ పూర్తయ్యేంత వరకూ నేతలు గాంధీ భవన్‌కు రావొద్దు

‘జూమ్’లో పాల్గొన్న మీనాక్షి, మహేష్ కుమార్ గౌడ్, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు

మన తెలంగాణ/హైదరాబాద్‌ః ఓట్ల సవరణ ప్రక్రియ(సర్) పర్యవేక్షణ బాధ్యత ఇన్‌చార్జి మంత్రులదేనని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ఎంపీలు పార్లమెంటు సమావేశాలకు వెళ్ళినా అక్కడి నుంచే సమీక్షించాల్సిందేనని ఆయన కఠినంగా అన్నారు. ఆదివారం పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన జూమ్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసిసి కార్యదర్శి సచిన్ సావంత్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, ‘సర్’ సమన్వయకర్తలు పాల్గొన్నారు.

జూమ్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ ‘సర్’ను ఇన్‌చార్జి మంత్రులు పూర్తిగా పర్యవేక్షణ చేయాల్సిందేనని అన్నారు. అన్నింటికీ వారిదే బాధ్యత అని చెబుతూ ఎంపీలు పార్లమెంట్ సమావేశాల్లో ఉన్నా కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు జరపాలని ఆయన కఠినంగా చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు, కార్పొరేషన్ల చైర్మన్లు, ఎస్‌ఐఆర్‌కు నియమించిన పార్టీ ఇన్‌చార్జ్‌లు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆయన ఆదేశించారు. ‘సర్’ గడువు వచ్చే నెల 3 వరకు పొడిగించడాన్ని ఒక అవకాశంగా తీసుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘సర్’పై 489 సమావేలు జరిగాయని ఆయన తెలిపారు. బాగా వెనుకబడిన నియోజకవర్గాల్లో ఇప్పటికైనా స్పందించాలని ఆయన సూచించారు.

గాంధీ భవన్ చుట్టూ తిరగొద్దు

ఇదిలాఉండగా చైర్మన్ పదవులు, పార్టీ పదవులు కావాలని గాంధీ భవన్ చుట్టూ తిరగొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ నాయకులను హెచ్చరించారు. అలాంటి వారికి అపాయింట్‌మెంట్లు ఇవ్వొద్దు అని ఆయన పిసిసిని ఉద్ధేశించి అన్నారు. రేపటి నుంచి వచ్చే నెల 3న ‘సర్’ ప్రక్రియ పూర్తయ్యే వరకూ నాయకులు గాంధీ భవన్‌కు రావొద్దు అని ఆయన తెలిపారు. కొందరు నాయకులు హైదరాబాద్‌లో కూర్చొని పనిచేయడం లేదు.

నేడు మంత్రుల సమీక్షలు..

సోమవారం పది మంది ఇన్‌చార్జ్ మంత్రులు అన్ని జిల్లాల్లో ‘సర్’పై సమీక్షా సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తున్న చోట ఎంపీలు పని చేయకపోతే కఠినంగా వ్యవహరిస్తాం అని ఆయన హెచ్చరించారు. పార్టీ పరంగా ‘సర్’ ఇన్‌చార్జీలుగా ఉన్న వారు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని ఆయన సూఇంచారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, చైర్మన్లు బిఎల్‌ఓల రిపోర్టుల కంటే బిఎల్‌ఏల రిపోర్టులను పరిశీలించాలని ఆయన ఆదేశించారు. బిఎల్‌ఓల రిపోర్టుల మీద మాత్రమే ఆధారపడితే కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. పార్టీ పరంగా పని చేస్తున్న బిఎల్‌ఏలను నాయకులు సమర్థవంతంగా ఉపయోగించుకోవాలన్నారు. పూర్తిగా క్షేత్రస్థాయిలో ఉండాలని, హైదరాబాద్ చుట్టూ తిరుగుతామంటే కుదరదని ఆయన హెచ్చరించారు. వచ్చే పది రోజులు ఎన్నికల ప్రచారం తరహాలో నియోజకవర్గాల్లో పర్యటించాలని ఆయన సూచించారు. బిఎల్‌ఏ, బిఎల్‌ఓ రిపోర్టులను గాంధీ భవన్ టీం ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆయన ఆదేశించారు.

30న మళ్ళీ సమీక్ష

ఈ నెల 30న మళ్లీ పూర్తి స్థాయి సమీక్ష నిర్వహిస్తామని, అసెంబ్లీల వారీగా నివేదికలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మరింత బాధ్యత తీసుకుని ఇన్‌చార్జి మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జిలను సమన్వయం చేయాలని ఆయన సూచించారు. సమయం తక్కువ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ’సర్’పై సీరియస్‌గా దృష్టి సారించాలని ఆయన ఆదేశించారు. బాగా పని చేసే 100 మంది బిఎల్‌ఏలకు రాహుల్ గాంధీని కలిసి ఫోటో దిగే అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షునికి సూచించారు.