
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డులో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒఆర్ఆర్ లోని ఎగ్జిట్ 18 వద్ద ఎయిర్పోర్టుకు వెళ్తుండగా కారు బోల్తాపడడంతో ఒకరు మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... దుబాయ్కు వెళ్తున్న తమ స్నేహితుడిని ఎయిర్పోర్టులో సాగనంపేందుకు రెండు కార్లలో స్నేహితులు బయలుదేరారు. కెఎ 29 ఎన్ 1908 అనే నంబర్ గల స్విప్ట్ డిజైర్ కారు అదుపుతప్పి బోల్తాపడడంతో ఖాజా అనే యువకుడు ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో జమీర్, యాకూబ్, అక్బర్ తీవ్రంగా గాయపడడంతో శంసాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.











