
హైదరాబాద్: మాజీ సిఎం కెసిఆర్ అసెంబ్లీకి రావాలనేది డైవర్షన్ లో భాగమేనని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ కలిసి డ్రామాలు ఆడుతున్నాయని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీలో హేట్ స్పీచ్ పై చట్టం చేయాలని, ఉద్యమకారులపై వేసిన కేకే కమిటీ ఏమైంది? అని కవిత ప్రశ్నించారు. ఉద్యమకారులకు ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. డిజిపి సివి ఆనంద్ వచ్చాక క్రైమ్ రేట్ పెరిగిందని, డిజిపి ప్రయోషన్ తో వచ్చారా? పైరవీతోనా అని ప్రశ్నించారు. తనపై అసభ్య పోస్టులు పెట్టిన పోలీస్ కానిస్టేబుల్ కె. అనిల్ ను వేటుతో సరిపెట్టారని, అదే పోస్టు తమ కుటుంబ సభ్యులపై పెడితే ఊరుకుంటామా? అని ప్రశ్నించారు. రాజకీయాల్లో ఉన్న ఆడబిడ్డలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తుంటే ప్రభుత్వం స్పందించడం లేదని కవిత విమర్శించారు.











