
అమరావతి: పిల్లలను పెంచే బాధ్యత తల్లిదండ్రులదని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇద్దరు బిడ్డలను సమానంగా చూసుకోవాలని అన్నారు. పోలవరం జిల్లా రంపచోడవరంలో చంద్రబాబు పర్యటించారు. మెగా పిటిఎంకు సిఎం, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తున్నామని తెలియజేశారు. లోకేష్ విద్యా శాఖను ఏరికోరి తీసుకున్నారని, విద్యాశాఖలో విజయాలను చూసి తానెంతో గర్వపడుతున్నానని చంద్రబాబు ఆనందాన్ని వ్యక్తం చేశారు. గతంలో ఎపిలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయిందని, అయితే రెండేళ్ల నుంచి పరిస్థితి మారిందని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందని అన్నారు. చేపలు ఇవ్వడం కాదని..చేపలు పట్టడం నేర్పాలని..సంక్షేమ కార్యక్రమాలు అవసరం..అలాగే అభివృద్ధి జరగాలని అధికారులకు సూచించారు. అప్పులు తీసుకువచ్చి సంక్షేమ పథకాలు అమలు చేయడం కష్టం అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.










