అమెరికా నేవీకి చెందిన భారీ విమాన వాహక యుద్ధనౌక రాకతో థాయ్లాండ్లోని ప్రముఖ పర్యాటక నగరం పట్టాయాలో సందడి పెరగనుంది. అయితే ఈ సందర్శన స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందన్న ఆశలతో పాటు.. సెక్స్ టూరిజం, అక్రమ కార్యకలాపాలపై ఆందోళనలను కూడా పెంచుతోంది.
USS Abraham Lincoln బుధవారం పట్టాయాకు సమీపంలోని లేమ్ చబాంగ్ పోర్టులో డాక్ కానుంది. దీనితో పాటు మరో రెండు అమెరికా నేవీ నౌకలు కూడా రానున్నాయి. 200 రోజులకు పైగా సముద్రంలో గడిపిన దాదాపు 5 వేల మంది నావికులు, మెరైన్లకు విశ్రాంతి, రిక్రియేషన్ కోసం ఈ పర్యటన ఏర్పాటు చేశారు.
పట్టాయా వ్యాపారాలకు ఆర్థిక బూస్ట్పై ఆశలు
అమెరికా నేవీ సిబ్బంది రాకను స్థానిక వ్యాపార వర్గాలు ఒక అవకాశంగా చూస్తున్నాయి. ఈ ఏడాది పర్యాటక రంగం మందగించడంతో పట్టాయా వ్యాపారాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
పట్టాయా మేయర్ పొరమాసే న్గాంపిచెస్ అంచనా ప్రకారం.. ఒక్కో అమెరికా సైనికుడు రోజుకు 1,000 నుంచి 3,000 థాయ్ బాట్ వరకు ఖర్చు చేసే అవకాశం ఉంది. అంటే సుమారు $30 నుంచి $91 వరకు ఖర్చు చేయవచ్చని అంచనా.
అయితే అందరూ ఒకేసారి తీరానికి రారు. షోర్ లీవ్ను విడతల వారీగా ఇవ్వనున్నారు. అయినప్పటికీ హోటళ్లు, రెస్టారెంట్లు, వినోద కేంద్రాలు, ఇతర స్థానిక వ్యాపారాలకు స్వల్పకాలికంగా ఆదాయం పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
పోలీసుల నిఘా మరింత కట్టుదిట్టం
అమెరికా నేవీ నౌక రాక నేపథ్యంలో పట్టాయా ప్రధాన బీచ్, నైట్లైఫ్ ప్రాంతాల్లో అదనపు పోలీస్ పెట్రోలింగ్ ఏర్పాటు చేస్తున్నారు.
వారాంతంలో నిర్వహించిన దాడుల్లో వ్యభిచారానికి పాల్పడుతున్నారనే అనుమానంతో 40 నుంచి 50 మందిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
థాయ్లాండ్లో వ్యభిచారం చట్టవిరుద్ధమైనప్పటికీ.. పట్టాయాతో పాటు కొన్ని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఈ రంగం బహిరంగంగా కనిపిస్తుంటుంది.
లైంగిక దోపిడీ, ఆరోగ్య సమస్యలపై ఆందోళన
అమెరికా సైనికుల భారీ రాకతో పట్టాయాలోని నైట్లైఫ్ రంగంపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
బ్యాంకాక్ యూనివర్సిటీకి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ పిపట్పాంగ్ ఫక్ఫారే ప్రకారం.. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో కస్టమర్లు రావడం వల్ల లైంగిక దోపిడీ, లైంగికంగా సంక్రమించే వ్యాధుల (STDs) వ్యాప్తి వంటి ఆరోగ్య, భద్రతా సమస్యలు పెరిగే అవకాశం ఉంది.
దీంతో ఆర్థిక ప్రయోజనాలను పొందుతూనే అక్రమ కార్యకలాపాలను అడ్డుకోవడం, ప్రజల భద్రతను కాపాడటం థాయ్ అధికారులకు సవాలుగా మారింది.
200 రోజులకు పైగా సముద్రంలోనే
USS Abraham Lincoln గత ఏడాది నవంబర్లో అమెరికాలోని శాన్ డియాగో నుంచి బయలుదేరింది. అనంతరం ఇరాన్తో సంబంధం ఉన్న అమెరికా-ఇజ్రాయెల్ ఘర్షణ నేపథ్యంలో మధ్యప్రాచ్య ప్రాంతానికి మళ్లించారు.
200 రోజులకు పైగా పోర్ట్ కాల్ లేకుండా సముద్రంలో ఉన్న ఈ నౌక ప్రయాణం ఆధునిక కాలంలో అత్యంత సుదీర్ఘ నేవీ డిప్లాయ్మెంట్లలో ఒకటిగా నిలిచింది. నౌకలో సిబ్బంది మానసిక ఆరోగ్యం, ఉత్సాహం తగ్గడంపై కొన్ని నివేదికలు వచ్చినప్పటికీ.. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ వాటిని ఖండించారు.
పట్టాయాకు టూరిజం పునరుజ్జీవనంపై ఆశలు
వియత్నాం యుద్ధ కాలంలో అమెరికా సైనికుల రాకతో పట్టాయా పర్యాటక కేంద్రంగా ఎదగడం ప్రారంభించింది. ఇప్పుడు మరోసారి అమెరికా నేవీ సిబ్బంది రాక స్థానిక వ్యాపారాలకు ఊరటనిస్తుందని అక్కడి వ్యాపార వర్గాలు ఆశిస్తున్నాయి.
అయితే నౌకలోని సిబ్బందిలో ఎంతమంది పట్టాయాలోనే గడుపుతారు, ఎంతమంది బ్యాంకాక్ వంటి ఇతర ప్రాంతాలకు వెళ్తారన్న దానిపైనే మొత్తం ఆర్థిక ప్రభావం ఆధారపడి ఉంటుంది.












