దేశ ఆర్థిక విధానాలకు దిశానిర్దేశం చేసే 2027-28 కేంద్ర బడ్జెట్‌ రూపకల్పన ప్రక్రియకు రంగం సిద్ధమైంది. అక్టోబర్ 12, 2026 నుంచి ప్రీ-బడ్జెట్ సమావేశాలను ప్రారంభించాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది.

ఆర్థిక వ్యవహారాల శాఖ జారీ చేసిన బడ్జెట్ సర్క్యులర్ ప్రకారం.. అక్టోబర్ 12 నుంచి నవంబర్ మధ్య వరకు ప్రీ-బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ సమావేశాలకు ఎక్స్‌పెండిచర్ సెక్రటరీ అధ్యక్షత వహించనున్నారు.

ఈ కసరత్తులో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27కు సంబంధించిన సవరించిన అంచనాలు (RE), వచ్చే ఆర్థిక సంవత్సరం 2027-28 బడ్జెట్ అంచనాలు (BE) ఖరారు చేసే ప్రక్రియ ఉంటుంది.

అక్టోబర్ 6లోపు వివరాలు ఇవ్వాలి

కేంద్రంలోని అన్ని మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాలు తమకు అవసరమైన నిధులు, వ్యయ అంచనాలు తదితర వివరాలను Union Budget Information System (UBIS)లో అక్టోబర్ 6లోపు నమోదు చేయాలని ఆర్థిక శాఖ ఆదేశించింది.

బడ్జెట్ అంచనాలు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. ఏడాది మధ్యలో తరచుగా నిధుల పునర్విభజన లేదా అదనపు కేటాయింపులు కోరాల్సిన పరిస్థితి రాకుండా ఖర్చులను ముందుగానే సరిగ్గా అంచనా వేయాలని పేర్కొంది.

ప్రీ-బడ్జెట్ సమావేశాల అనంతరం ఆయా మంత్రిత్వ శాఖలకు తాత్కాలిక వ్యయ పరిమితులను సూచిస్తారు. ప్రభుత్వ ఆదాయ అంచనాలు, ప్రాధాన్యతలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత తుది వ్యయ పరిమితులను నిర్ణయిస్తారు.

వృద్ధి, ఉద్యోగాలపై ఫోకస్

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి కొనసాగుతున్న సమయంలో 2027-28 బడ్జెట్‌ రూపకల్పన జరుగుతోంది. మరోవైపు ఆహారం, ఇంధన ధరలు కూడా పెరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం, సంస్కరణలను కొనసాగించడం, ఉద్యోగాల కల్పన, దేశీయ డిమాండ్‌ను పెంచడం వంటి అంశాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది.

కొత్త పథకాలకు నిధులు కోరే ముందు ఇప్పటికే కొనసాగుతున్న పథకాలు, తప్పనిసరి ఖర్చులకు అవసరమైన కేటాయింపులను ముందుగా పరిగణనలోకి తీసుకోవాలని మంత్రిత్వ శాఖలకు సూచనలు వెళ్లాయి.

తుది అంచనాలు ఎప్పుడు?

ప్రీ-బడ్జెట్ సమావేశాలు పూర్తయిన తర్వాత వ్యయ అంచనాలను మరింత పరిశీలించి తుది పరిమితులను ఖరారు చేస్తారు.

ఆర్థిక శాఖ నిర్దేశించిన ప్రక్రియ ప్రకారం 2026 డిసెంబర్ చివరి నాటికి లేదా 2027 జనవరి ప్రారంభంలో తుది వ్యయ గణాంకాలను UBISలో నమోదు చేసే అవకాశం ఉంది.

2027-28 కేంద్ర బడ్జెట్‌ ప్రధాని మోదీ నేతృత్వంలోని మూడో దశ ప్రభుత్వంలో నాలుగో బడ్జెట్ కానుంది. అలాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ప్రవేశపెట్టనున్న 10వ బడ్జెట్ కూడా ఇదే కానుంది.

అక్టోబర్ 12 నుంచి ప్రారంభం కానున్న సమావేశాలతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ఖర్చులు, ఆదాయాలు, సంక్షేమం, అభివృద్ధి ప్రాధాన్యతలకు సంబంధించిన కీలక నిర్ణయాలకు పునాది పడనుంది.