ఇటీవల న్యూఢిల్లీలో ముగిసిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో, పలువురు ప్రపంచ నాయకులు ఒకేచోట సమావేశమై, ఒకరినొకరు కలుసుకుంటూ, ఆలింగనం చేసుకుంటూ, చిరునవ్వులు పంచుకున్నారు. ఈ శిఖరాగ్ర సమావేశంలో తీసిన అధికారిక చిత్రాలు, ఛాయాచిత్రాలు జాగ్రత్తగా ఎంపిక చేసినప్పటికీ, ఇటువంటి ప్రపంచ స్థాయి కార్యక్రమాలలో దౌత్యం ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే, తెరవెనుక ఇంతకంటే చాలా ఎక్కువ జరుగుతుంది, అక్కడ ప్రపంచ నాయకులు స్వేచ్ఛగా ఉంటూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటారు. వారాంతంలో న్యూఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన, సున్నితమైన, ప్రముఖ దౌత్యప్రదేశాలలో ఒకటిగా మారడంతో, ప్రధాని నరేంద్ర మోడీ తోపాటు ఇతర ప్రపంచ నాయకులు కూడా ఒకరితో ఒకరు సంభాషిస్తూ, చిరునవ్వులు, కరచాలనాలు, ఆలింగనాలు, అనేక సహజమైన క్షణాలను పంచుకుంటూ కనిపించారు. యుద్ధాలు, శిక్షాత్మక సుంకాలు, ఆర్థిక ఘర్షణలు ప్రపంచాన్ని విభజించిన తరుణంలో, భారతదేశం ఢిల్లీలో ప్రధాన శక్తులను ఒకచోట చేర్చి, తన పరస్పర విరుద్ధ ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఒక ఒప్పందాన్ని కుదర్చడంలో సహాయపడింది. పుతిన్, జీ జిన్‌పింగ్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌లకు ఆతిథ్యం ఇవ్వడం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఒక ఉమ్మడి ప్రకటన ఆ సమావేశానికి సార్థకతను చేకూర్చింది. ప్రపంచ సంక్షోభాల భారాన్ని మోస్తూ, ప్రపంచ నిర్ణయాలలో చాలా తక్కువ ప్రాతినిధ్యం ఉన్న దేశాల తరఫున మాట్లాడేందుకు భారతదేశం మరింత అధికారంతో ఉన్నత స్థానంలో నిలిచింది. అయితే, దురదృష్టవశాత్తు మీడియా దృష్టి ఎక్కువగా వంటకాలు, శాకాహారం వర్సెస్ మాంసాహారం వివాదం చుట్టూ తిరిగింది. మెనూపై జరిగిన ఈ రాజకీయ వివాదం తీవ్రమైన పరిణామాలను కప్పివేసింది. విందు లో విచ్చేసిన నాయకులకు ఏమి వడ్డించారు? శాకాహారమా లేక మాంసాహారమా! అనే దానికంటే, లక్షలాదిమంది ప్రజలు ఆహారాన్ని పండించే పరిస్థితులు ఎక్కువ శ్రద్ధకు అర్హమైనవి. ‘ఉమ్మడి ప్రకటనలో వ్యవసాయం, డబ్ల్యూటిఒ సంస్కరణలు, విత్తన వ్యవస్థలలో రైతుల హక్కులకు చోటు లభించినప్పటికీ, మన ప్రజా చర్చలోనూ, మీడియాలోనూ వీటికి తగినంత ప్రాధాన్యత లభించలేదు’ అని పంజాబ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యుడు గురుప్రతాప్ సింగ్ మాన్ విచారం వ్యక్తం చేశారు. రైతు సంఘాలకు, ఈ హామీలు పరిశీలించడానికి, అనుసరించడానికి, ప్రభుత్వాలను జవాబుదారీగా ఉంచడానికి ఒక నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళికను అందిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తూ ఇవి దౌత్యవర్గాలకు అతీతంగా చర్చకు అర్హమైనవని తెలిపారు. 45 పేజీల ఉమ్మడి ప్రకటన వెలువడటమే భారత్ సాధించిన గొప్ప దౌత్యవిజయంగా మీడియా అభివర్ణించింది. అయితే, జిన్‌పింగ్, పుతిన్ తొలినుండి వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలతోపాటు గత ఏడాది రియోలో బ్రిక్స్ సదస్సు ఆమోదించిన ఉమ్మడి ప్రకటనకు భిన్నంగా లేదని వెల్లడవుతుంది. గాజా యుద్ధం, పహల్గామ్ ఉగ్రదాడి లేదా యుఎన్‌ఎస్‌సి సంస్కరణల వంటి అనేక విషయాలలో ఇది 2025 రియో ప్రకటనను ప్రతిధ్వనించింది. ఈ ప్రకటన అత్యంత ముఖ్యమైన ‘టి’ అయిన ట్రంప్ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ వాణిజ్యం, సుంకం అనే మిగతా రెండు ‘టి’లను ఉపయోగించింది. ఈ అంశాలు ప్రకటనలో పదేపదే ప్రస్తావించారు. ప్రపంచ రాజకీయాల్లో సంక్షోభం నెలకొన్న తరుణంలో దాదాపు ప్రతి బహుపాక్షిక వేదిక ప్రభావం లేని ఆర్భాటాలుగా మారుతున్నాయి. ఇవి కేవలం అగ్రరాజ్యాలు తమ ఆధిపత్య ప్రభావాన్ని విస్తరించుకోవడానికి ఉపయోగపడే సాధనాలుగా మాత్రమే మిగులుతున్నాయి. అయితే, న్యూఢిల్లీ ప్రకటన 2026, ఎంతో అవసరమైన మూడవ అభిప్రాయాన్ని నొక్కిచెబుతోంది. దౌత్యం, సహకారం, ఆలోచనలు, వస్తువులు, సేవల వినిమయం అనేవి అగ్రరాజ్యాల భావజాలాలకు, ప్రయోజనాలకు కట్టుబడి ఉండనవసరం లేదని ఇది పేర్కొంటుంది. విభిన్న రాజకీయ వ్యవస్థలు, సైనిక ఘర్షణల్లో పరస్పర విరుద్ధ పక్షాల్లో ఉన్న దేశాలు కూడా కలిసి కూర్చుని, ఒక అంగీకారానికి వచ్చి, విభేదాలను అంగీకరించడానికే ఆస్కారం ఉంది. కాబట్టి, న్యూఢిల్లీ ప్రకటన బలం, అది సృష్టించని సంచలనాత్మక శీర్షికలలో, యథాతథ దౌత్యం ప్రాముఖ్యతను పునరుద్ఘాటించడంలో ఉంది.పశ్చిమ ఆసియా ఇజ్రాయెల్- పాలస్తీనా, ఇరాన్ -లెబనాన్, ఇప్పుడు యెమెన్ వంటి దీర్ఘకాలిక సంఘర్షణలతో సతమతమవుతున్న తరుణంలో, ‘గరిష్ట సంయమనం పాటించడంతోపాటు, పరిస్థితిని మరింత తీవ్రతరం చేసే చర్యలకు దూరంగా ఉండాలి’ అని ఇరాన్, యుఎఇల మధ్య కుదిరిన ఏకాభిప్రాయం దౌత్యానికి ఒక స్పష్టమైన విజయం. పశ్చిమ ఆసియాకు అతీతంగా, ఈ ప్రకటన ప్రస్తుత వాక్చాతుర్యాన్ని అధిగమించి నిలిచిపోయే సమస్యలపై దృష్టి సారిస్తోంది. ఈ పత్రంలోని 130కి పైగా పేరాలు ‘ఏకపక్ష నిర్బంధ చర్యలు’, ‘ఏకపక్ష ఆంక్షలు’, ‘ఏకపక్ష దిగ్బంధనాలు’ వంటి అంశాలపై దృష్టి సారించాయి. ఇది డొనాల్డ్ ట్రంప్ హయాంలో వాషింగ్టన్ చేసిన దురాగతాలపై ఒక వ్యాఖ్యగా, వాటికి వ్యతిరేకంగా ఒక ప్రతిఘటనగా నిలుస్తుంది. హైడ్రో కార్బన్‌లతో సహా, ముఖ్యంగా నిత్యావసర వస్తువుల సరఫరా గొలుసులు, వాణిజ్య మార్గాలను ఆయుధాలుగా మార్చకూడదనే స్పష్టమైన సందేశం ఇచ్చే ప్రయత్నం జరిగింది. గ్లోబల్ సౌత్‌లోని అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇంధన సమస్య ప్రత్యేకంగా ముఖ్యమైనది. బ్రిక్స్ కరెన్సీ అనే భ్రమను వెంబడించకుండా, సభ్యదేశాల మధ్య చెల్లింపు వ్యవస్థలను అనుసంధానించడంపై ఈ ప్రకటన దృష్టి సారించడం విశేష పరిణామం. ఈ విషయంలో భారతదేశపు యుపిఐ వ్యవస్థకు గొప్ప సామర్థ్యం ఉంది. ఎఐ సామర్థ్య నిర్మాణం, డిజిటల్ స్థితిస్థాపకతపై దృష్టి పెట్టడంలో కూడా ఢిల్లీ ముద్ర కనిపిస్తుంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంస్కరణల విభాగానికి సంబంధించి, ఈ ప్రకటన ఇలా పేర్కొంది: 2022 బీజింగ్, 2023 జోహన్నెస్‌బర్గ్-II నాయకుల ప్రకటనలను గుర్తుచేసుకుంటూ, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి శాశ్వత సభ్యదేశాలుగా చైనా, రష్యా, ఐక్యరాజ్యసమితిలో, దాని భద్రతా మండలితో సహా, మరింత కీలక పాత్ర పోషించాలన్న బ్రెజిల్, భారతదేశాల ఆకాంక్షలకు తమ మద్దతును పునరుద్ఘాటిస్తున్నాయి. ‘ఢిల్లీ డిక్లరేషన్’ ఉగ్రవాదాన్ని, పహల్గామ్ ఘటనను ఖండిస్తోంది, కానీ పహల్గామ్ దాడికి ఎవరు పాల్పడ్డారో అందులో ఎక్కడైనా పేర్కొన్నారా? ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదానికి ఎవరు పాల్పడుతున్నారో ఎక్కడైనా ప్రస్తావించారా? అని మరో కాంగ్రెస్ నాయకుడు ప్రశ్నించారు.