
మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ వేదికగా ఈనెల 18వ తేదీన జరిగే జీఆర్ఎంబీ సమావేశంపై తెలంగాణ ప్రభుత్వం మౌనం చూస్తుంటే జీఆర్ఎంబీ సమావేశం కేవలం ఏపి ప్రయోజనాల కోసమే జరుగుతుందా? అన్న అనుమానం కలుగుతోందని మాజీ మంత్రి, బిఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆరోపించారు. ఎజెండా వచ్చి ఇన్ని రోజులు అవుతున్నా తెలంగాణ ప్రభుత్వం కనీసం స్పం దించకపోవడం దారుణమని ఆయన తెలిపా రు. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి, బిఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్రావు బుధవా రం విలేకరులతో మాట్లాడుతూ ఎపి ప్రతిపాదించిన అంశాలు చూస్తే తెలంగాణ ఆత్మగౌర వం ఉన్న ప్రతి ఒక్కరి కడుపు మండక మానద ని, రక్తం మరిగిపోక తప్పదన్నారు. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే కుట్రలను పటాపంచలు చేయాల్సిన ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. గురుదక్షిణ కోసమే సిఎం రేవంత్రెడ్డి మౌనం వహిస్తున్నారా అని హరీష్రావు ప్రశ్నించారు.
ప్రతిపక్షాలపై అడ్డగోలు గా మాట్లాడే రేవంత్ రెడ్డి పక్క రాష్ట్రం తెలంగా ణ నీటి హక్కులను కాలరాస్తుంటే ఎందుకు మాట్లాడటం లేదన్నారు. చంద్రబాబు విషయంలో రేవంత్రెడ్డి ఎందుకు నోరు మెదపడం లేదని, చంద్రబాబు అంటే అంత భయమా? అ ని హరీష్రావు ప్రశ్నించారు. కాళేశ్వరం, చౌటుపల్లి హన్మంతరావు, చిన్న కాళేశ్వరం, చనాకా-కొరటా, మోదికుంట వాగు, కడెంగూడెం లిఫ్ట్, సీతారామ లిఫ్ట్ వంటి ప్రాజెక్టులకు ఇచ్చిన అనుమతులను నిలిపివేయాలని, వాటిని పునఃసమీక్షించాలని ఎపి కోరుతోందన్నారు. సమ్మక్క బ్యారేజీకి సంబంధించిన క్లియరెన్సులను కూడా నిలిపివేయాలని ఎపి ప్రతిపాదిస్తోందన్నారు. కొత్తగా అనుమతులు ఇవ్వాలని కాదు, కెసిఆర్ ప్రభుత్వం సాధించిన ఈ ఏడు ప్రాజెక్టుల అనుమతులను రివ్యూ చేయాలని ఎపి కోరుతోందన్నారు. ఆ ప్రతిపాదనను జీఆర్ఎంబీ ఎజెండాలో చేర్చడం దుర్మార్గమైన విషయమని హరీష్రావు ఆరోపించారు.
తెలంగాణకు చెందిన ఏడు కీలక ప్రాజెక్టుల అనుమతులను నిలిపివేయాలని ఎపి ప్రతిపాదిస్తుంటే తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తోందని, తెలంగాణ ఇంజనీర్లు ఏం చేస్తున్నారు? ఇప్పటికే అనుమతులు సాధించిన ప్రాజెక్టుల అనుమతులను రద్దు చేసే అధికారం ఎవరు ఇచ్చారని హరీష్రావు ప్రశ్నించారు. తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ దీనిపై సమాధానం చెప్పాలని హరీష్రావు డిమాండ్ చేశారు. జీఆర్ఎంబీ అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఒక బోర్డు మాత్రమేనని, జీఆర్ఎంబీ కేంద్ర ప్రభుత్వానికి ఎలా నిర్దేశాలు ఇస్తుందని హరీష్రావు ప్రశ్నించారు. కేంద్రంలోని అన్ని కీలక విభాగాలు పరిశీలించిన తర్వాతే తెలంగాణ ప్రాజెక్టులకు టిఏసీ అనుమతులు ఇచ్చిందన్నారు. టిఏసీలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కీలక విభాగాలన్నీ ఉంటాయి. కేంద్రం పరిశీలించి అనుమతించిన తర్వాత వాటిని మళ్లీ రద్దు చేయాలని చెప్పే అధికారం జీఆర్ఎంబీకి ఎక్కడిదని హరీష్రావు అన్నారు.
తెలంగాణ ప్రాజెక్టుల అనుమతులను రద్దు చేయాలని ఎపి ప్రతిపాదిస్తోంది
దేశ చరిత్రలో అనుమతులు వచ్చిన తర్వాత ప్రాజెక్టులపై రివ్యూ చేయడం, రద్దు చేయడం జరిగిన సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా? అని హరీష్రావు ప్రశ్నించారు. తొలిసారి దేశంలో తెలంగాణ ప్రాజెక్టుల అనుమతులను రద్దు చేయాలని ఎపి ప్రతిపాదిస్తోందని, ఎపి ప్రతిపాదిస్తే జీఆర్ఎంబీ దాన్ని వ్యతిరేకించాలి కదా? అని హరీష్రావు ప్రశ్నించారు. సమ్మక్క సాగర్కు ఉరి వేసే కుట్ర జరుగుతోందని, ముగ్గురు ముఖ్యమంత్రుల సమావేశంలో సమ్మక్క సాగర్కు కేటాయించిన 47 టిఎంసీల నీటి వాటాను వదులుకునేందుకు రేవంత్ రెడ్డి ఒప్పుకుంటున్నారా? దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని హరీష్రావు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు ఎల్ రమణ, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ రవీందర్ రావు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.








