హైదరాబాద్: తెలంగాణ లో యువత నిర్వేదంలో ఉన్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. ఎన్నికల ముందు డిక్లరేషన్ల పేరుతో కాంగ్రెస్ నేతలు బిల్డప్ ఇచ్చారని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్, బిజెపి యువతను వాడుకుంటోందని, రెండున్నరేళ్లుగా జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదని విమర్శించారు. పోలీసు ఉద్యోగాలు 20 వేలు ఖాళీ ఉన్నాయని, 7 వేల ఉద్యోగాలకే ఎందుకు నోటిఫికేషన్ ఇచ్చారు? అని కెటిఆర్ ప్రశ్నించారు. ఖమ్మంలో ఓ విద్యార్థి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యాయత్నం చేశాడని, ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ఆత్మ హత్యాయత్నం చేస్తుంటే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పట్టించుకోరా? అని ఆయన ఎందుకు హైదరాబాద్ రావడం లేదని ప్రశ్నించారు. ఆ విద్యార్థి రాసింది సూసైడ్ నోట్ కాదు..కాంగ్రెస్ ప్రభుత్వంపై రాసిన ఛార్జ్ షీట్ అని తెలియజేశారు.

అశోక్ నగర్ లో రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు విలువలేదని, పిల్లల ముందుకొచ్చి మాట్లాడే ధైర్యం ఆయనకు లేదని కెటిఆర్ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నా..రాహుల్ గాంధీ పట్టించుకోరా? అని ప్రశ్నించారు. ఇంజనీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అని సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడితే చాలా బాధపడ్డామని, అత్యధిక క్రిమినల్ కేసులున్న వ్యక్తిని సిఎం చేయడమే క్రిమినల్ వేస్ట్ అని ధ్వజమెత్తారు. రాహుల్, రేవంత్ రెడ్డి కలిసి ఇచ్చిన హామీలు క్రిమినల్ వేస్ట్ అని హామీల అమలుకు డబ్బులు లేవంటూ అందాల పోటీలకు రూ. 200కోట్లు ఖర్చుపెట్టడం క్రిమినల్ వేస్ట్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలు ఎన్నో చెప్పాలని డిమాండ్ చేశారు. బిఆర్ఎస్ హయాంలో 2 లక్షలకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చామని, మళ్లీ పక్కా ప్రణాళికతో బిఆర్ఎస్ అధికారం లోకి వస్తుందని పేర్కొన్నారు. ఆత్మహత్యలు చేసుకోవద్దని విద్యార్థులను కోరుతున్నానని కెటిఆర్ విజ్ఞప్తి  చేశారు.