బిహార్ రాజధాని పాట్నాలో బిజెపి, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బిజెపి చేపట్టిన నిరసన సందర్భంగా ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జ్ నిర్వహించారు. ఘర్షణకు సంబంధించిన దృశ్యాల్లో ఇరు వర్గాల కార్యకర్తలు కర్రలతో పరస్పరం దాడి చేసుకోవడంతో పాటు రాళ్లు రువ్వుకుంటూ కనిపించారు. ఈ ఘటనలో రెండు పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలు గాయపడ్డారు. హింసాత్మక పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని లాఠీచార్జ్ చేసి నిరసనకారులను చెదరగొట్టారు. అనంతరం ఆ ప్రాంతాన్ని పూర్తిగా ఖాళీ చేయించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

ఇదిలా ఉండగా, నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తదితరులు గురువారం ఢిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారిక నివాసం వెలుపల నిరసన చేపట్టారు. పోలీసులు వారిని కొద్దిసేపు అదుపులోకి తీసుకుని అనంతరం అక్కడి నుంచి తరలించారు.నీట్ అంశంపై ప్రధాన నిరసన కార్యక్రమాన్ని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఉద్యమకారుడు సోనం వాంగ్‌చుక్ ప్రస్తుతం గురుగ్రామ్‌లోని మెదాంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు.