
మన తెలంగాణ/హైదరాబాద్: దక్షిణాది చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న ప్రముఖ నటి షావుకారు జానకి (94) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా వ యోభారంతో పాటు తీవ్ర శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆమె చెన్నైలోని కావేరి ఆసుపత్రి లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆ మె మృతితో తెలుగు, తమిళ, కన్నడ సినీ ప్రముఖులు, అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రికి చెందిన జానకి.. విజయా వారి ఆల్టైమ్ క్లాసిక్ చిత్రం షావుకారు (1950) ద్వారా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. షావుకారు సినిమా హిట్ కావడంతో ఆమెకు షావుకారు జానకిగా పేరు వచ్చింది. దాదాపు 70 ఏళ్ల సుదీర్ఘ నటప్రస్థానంలో తెలుగు,
తమిళ, కన్నడ భాషల్లో 400కు పైగా చిత్రాల్లో ఆమె నటించి ప్రేక్షకులను అలరించారు. 3 హిందీ చిత్రాల్లో, ఒక మలయాళ సినిమాలో నటించి మెప్పించారు. అలనాటి మహానటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎంజీఆర్, శివాజీ గణేషన్లతో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు షావుకారు జానకి. కన్యా శుల్కం, పిచ్చి పుల్లయ్య, వద్దంటే డబ్బు, రోజులు మారాయి, రేచుక్క పగటిచుక్క, సొంత ఊరు, డాక్టర్ చక్రవర్తి, సంసారం ఒక చదరంగం, జయం మనదే, తోడికోడళ్లు, బాబు బంగారం, గీతాంజలి తదితర అనేక హిట్ చిత్రాల్లో షావుకారు జానకి నటించి ప్రేక్షకులను అలరించారు. ఆమె చివరిసారి ‘అన్నీ మంచి శకునములే’ చిత్రంలో నటించారు. సినీ రంగానికి చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం ఆమెను 2022లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీవ్ర విచారం
ప్రముఖ నటి, పద్మశ్రీ షావుకారు జానకి మృతిపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చిన్నతనం నుంచే నాటకాల్లో వివిధ పాత్రలు పోషిస్తూ కెరీర్ను ప్రారంభించిన షావుకారు జానకి దాదాపు ఏడు దశాబ్దాల పాటు చలనచిత్ర రంగంలో తనదైన ముద్ర వేశారని సిఎం పేర్కొన్నారు. ‘షావుకారు’ సినిమాలో అసమాన ప్రతిభ కనబరిచి షావుకారు జానకిగా స్థిరపడ్డారని సిఎం గుర్తుచేశారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో దాదాపు 400 చిత్రాల్లోనే కాకుండా హిందీ, మలయాళ చిత్రాల్లో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించారని సిఎం అన్నారు. పలు మేటి చిత్రాల్లో షావుకారు జానకి పోషించిన పాత్రలు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలుస్తాయని ముఖ్యమంత్రి కొనియాడారు. చలనచిత్ర రంగంలో ఆమె లేని లోటు పూడ్చలేనిదని ఆయన అన్నారు. భగవంతుడు ఆమెకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తూ, అమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు ముఖ్యమంత్రి సంతాపాన్ని, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.











