
అమరావతి: పాలన బాగుంటే ప్రజల మీద నెగిటివ్ ప్రభావం ఉండదని సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. బ్రాండ్ ఆంధ్రా ఎస్టాబ్లిష్ అయితే తిరుగుండదని అన్నారు. ఆర్థికశాఖపై శ్వేతపత్రం సిఎం విడుదల చేశారు. ఈ సందర్భంగా సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2024లో అఖండ విజయం సాధించామని, కూటమి ప్రభుత్వం రాగానే బ్రాండ్ ఎపిని పునరుద్ధరించామని తెలియజేశారు. ఒక ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తే ఎలా ఉంటుందో భోగాపురం విమానాశ్రయమే ఉదాహరణ అని 2014 నుంచి ఎపి వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా మారిపోయిందని చంద్రబాబు పేర్కొన్నారు.
విభజన సమయంలో ఆస్తుల పంపకం సవ్యంగా జరగలేదని, 2019 తర్వాత రాష్ట్రం విధ్వంసానికి గురైందని విమర్శించారు. 2024 లో ప్రగతిశీల విధానాలతో పాటు క్వాంటం లాంటి టెక్నాలజీపై దృష్టి పెట్టామని, రాజధానితో పాటు పోలవరం సహా వివిధ ప్రాజెక్టుల పునర్ నిర్మాణం చేపట్టామని అన్నారు. రెండేళ్లలో రూ.1 లక్షా 49 వేల కోట్లు సంక్షేమం కోసం ఖర్చు పెట్టామని, 15,941 టీచర్ పోస్టులు మెగా డిఎస్సి ద్వారా భర్తీ చేశామని అన్నారు. మెగా డిఎస్సిలో ఎక్కడా అవినీతి, అక్రమాలు జరగలేదని, ఎవ్వరూ ఊహించని విధంగా అన్ని పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. పెట్టుబడులు వస్తే ఆర్థికంగా పుంజుకుంటామని, 2014 లో బస్ లో ఉండి పరిపాలించాల్సిన పరిస్థితి ఉండేది కాదని చెప్పారు. తెలంగాణలో ఆస్తులన్నీ తెలగువాళ్లు అనుభవిస్తున్నారని, 2024 ఎన్నికల్లో ఏమేం చెప్పామో అవన్నీ చేస్తున్నామని అన్నారు. 2025-26 లో పది సూత్రాలతో స్వర్ణాంధ్ర విజన్ 2047 తయారు చేశామని, పెండింగ్ బిల్లులన్నీ క్లియర్ చేస్తున్నామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.











