హైదరాబాద్: విద్యార్థులు చేస్తున్న ఆందోళన సరైందని తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్సీ కోదండరాం తెలిపారు. విద్యార్థులు న్యాయమైన డిమాండ్లు లేవనెత్తారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థుల మహాధర్నాకు సంఘీభావం ప్రకటిస్తున్నామని, పరీక్షలు సక్రమంగా జరిపి భవిష్యత్తు కాపాడాలని కోరుతున్నామని తెలియజేశారు. పేపర్ లీక్ లతో పాటు పరీక్షలు అస్తవ్యస్తంగా జరుగుతున్నాయని, సిబిఎస్ఇ, నీట్ సహా 150 పరీక్షల వరకు గందరగోళంగా మారాయని కోదండరాం విమర్శించారు. భవిష్యత్తు ఏమవుతుందనే అయోమయ స్థితిలో విద్యార్థులు ఉన్నారని, పరీక్షలు సరిగా నిర్వహించకపోవడం వల్లే ఆందోళనలు జరుగుతున్నాయని మండిపడ్డారు. విద్యార్థుల ఆందోళనకు ప్రజాస్వామ్య వాదులంతా మద్దతు ఇవ్వాలని, శాంతియుతంగా, చట్టబద్ధంగా విద్యార్థుల ఆందోళన జరుగుతోందని తెలియజేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని..లాఠీఛార్జ్ కు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, పేపర్ లీకేజ్ కు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోదండరాం కోరారు.