తిరుమల: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తులకు వసతి విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య అధికారులను ఆదేశించారు. సెప్టెంబరు 15 నుంచి 23వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో గురువారం తిరుమలలోని సుధర్మ సమావేశ మందిరంలో రిసెప్షన్ విభాగంపై అదనపు ఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వసతి గదుల్లో ఏవైనా మరమ్మతులు పెండింగ్‌లో ఉంటే వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. బ్రహ్మోత్సవ విధులకు డిప్యూటేషన్‌పై వచ్చే సిబ్బందికి కూడా తగిన వసతి సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. బ్రహ్మోత్సవ రోజుల్లో డిప్యూటేషన్‌పై వచ్చే సిబ్బందికి వసతి కేటాయించేందుకు వీలుగా తిరుమలలోని మఠాలు, కర్ణాటక సత్రాల్లోని 60 శాతం గదులను టీటీడీ రిసెప్షన్ విభాగం నియంత్రణలోకి తీసుకోవాలని అదనపు ఈవో ఆదేశించారు. ఈ సమావేశంలో తిరుమల ఎస్టేట్ అధికారి శ్రీ వేంకటేశ్వర్లు, ఇన్‌ఛార్జ్ ఐటీ జీఎం శ్రీ వేంకటేశ్వర్లు నాయుడు, రిసెప్షన్ ఓఎస్డీ శ్రీ సత్రే నాయక్, ఏఈఓ శ్రీ అశోక్ తదితర అధికారులు పాల్గొన్నారు.