అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో జూలై 31 నుంచి ఆగస్టు 2, 2026 వరకు మేరీల్యాండ్‌లోని బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనున్న 19వ ATA కాన్ఫరెన్స్ & యూత్ కన్వెన్షన్లో ప్రత్యేకంగా "బిజినెస్ మ్యాచ్‌మేకింగ్ @ ATA 2026" కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.

తెలుగు వ్యాపారవేత్తలు, స్టార్టప్ వ్యవస్థాపకులు, పెట్టుబడిదారులు, కార్పొరేట్ నాయకులు ఒకే వేదికపై కలుసుకుని పరస్పర వ్యాపార భాగస్వామ్యాలను ఏర్పరచుకునేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. సాధారణ నెట్‌వర్కింగ్‌కు భిన్నంగా, ముందస్తుగా ఎంపిక చేసిన పాల్గొనేవారితో 1:1 బిజినెస్ మీటింగ్స్, ఇండస్ట్రీ ఆధారిత డీల్ టేబుల్స్, ధృవీకరించిన వ్యాపార భాగస్వాములు వంటి అవకాశాలు కల్పించనున్నారు.

ఈ బిజినెస్ మ్యాచ్‌మేకింగ్ కార్యక్రమంలో గవర్నమెంట్ కాంట్రాక్టింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఐటీ & స్టాఫింగ్ సర్వీసెస్, హెల్త్‌కేర్ వంటి కీలక రంగాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ATA సభ్యత్వం, స్థిరమైన వ్యాపార అనుభవం, సామర్థ్య వివరాలు (Capability Statement) వంటి అర్హతలు అవసరమని నిర్వాహకులు తెలిపారు. సుమారు మూడు గంటల పాటు కొనసాగే ఈ ప్రత్యేక సెషన్‌కు 100 మంది మాత్రమే ఎంపిక చేయబడతారని, అర్హత కలిగిన వారు ముందస్తుగా నమోదు చేసుకోవాలని సూచించారు.

ఆటా మహాసభలను అధ్యక్షుడు జయంత్ చల్లా నాయకత్వంలో ATA టీమ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. కన్వీనర్ శ్రీధర్ బనాలా, కోఆర్డినేటర్ రవి చల్లా, నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల, డైరెక్టర్ సుధీర్ దామిడి, కో-కోఆర్డినేటర్ జీనత్ కుందూర్, కో-కన్వీనర్ అరవింద్ ముప్పిడి, కో-నేషనల్ కోఆర్డినేటర్ కౌశిక్, కాన్ఫరెన్స్ రీజినల్ కోఆర్డినేటర్ తిరుమల రెడ్డి మునుకుంట్ల, కో-డైరెక్టర్ కిరణ్ ఆలా తదితరులు సమన్వయంతో పనిచేస్తూ మహాసభలను విజయవంతం చేసేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

WhatsApp Image 2026-07-29 at 8.23.58 PM (1).jpeg