24410 వార్తలు


టీం ఇండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు 2027 ప్రపంచకప్ వరకూ వన్డే జట్టులో కొనసాగుతారా? లేదా? అనే విషయంపై కొంతకాలంగా చర్చ జరుగుతోంది. అయితే వీరిద్దరి భవిష్యత్తుపై వారికి పూర్తి స్పష్టత ఇవ్వాలని బిసిసిఐ, జట్టు యాజమాన్యాన్ని భారత మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ కోరాడు. 2027 ప్రపంచకప్ కోసం టీం ఇండియా ప్రణాళికల్లో తాము ఉన్నామో, లేదో తెలుసుకునే హక్కు వారికి ఉందని అన్నాడు. రో-కో విషయంలో నెలకొన్ని అనిశ్చితి తన అంతర్జాతీయ కెరీర్ చివరి రోజులను గుర్తు చేసిందని పేర్కొన్నాడు. ‘‘రోహిత్, విరాట్ ప్రస్తుతం ఉన్నట్లువంటి పరిస్థితి నేను కూడా గతంలో ఎదుర్కొన్నా. వారు ఆడాలా? వద్దా అని నిర్ణయించే అధికారం అభిమానులకు లేదు. ఆ నిర్ణయం తీసుకోవాల్సింది జట్టు యాజమాన్యం, కోచ్, సెలక్టర్లు. రోహిత్, కోహ్లీ ప్రపంచకప్ ఆడాలని మేనేజ్మెంట్ కోరుకుంటే.. ‘మిత్రురాలా.. మీరు ప్రపంచకప్ ఆడాలని కోరుకుంటున్నాం. మీకు మా పూర్తి మద్దతు ఉంటుంది. మైదానంలోకి వెళ్లి మీ సహజశైలిలో ఆడండి. ఒకవేళ ఏదైనా సిరీస్ సరిగా ఆడకపోతే జట్టులో స్థఆనం కోల్పోతామనే ఒత్తిడిని అస్సలు పెట్టుకోవద్దు’’ అని చెప్పాలని యువరాజ్ పేర్కొన్నాడు.





అమరావతి: సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల ప్రైవేటీకరణ అంటూ వైసిపి నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలో ఎన్ ఎఫ్ డిబి ప్రాంతీయ కార్యాలయం అవసరం అని అన్నారు. డాక్యుమెంట్ రైటర్ల పెన్ డౌన్ పై సిఎం స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డాక్యుమెంట్ రైటర్లకు ఉపాధి మార్గాలు చూపిస్తామని, మెరుగైన సేవల కోసమే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలియజేశారు. దీపం-2.0 లబ్ధిదారులకు నిర్ధారిత తేదీల్లో నగదు జమ అవుతుందని, పాస్ పోర్ట్ సేవా కేంద్రాల తరహాలోనే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రం ఏర్పాటు చేస్తామని, ప్రజలకు వాస్తవాలు వివరించే బాధ్యత అధికారులదేనని చంద్రబాబు సూచించారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల వల్ల లాభాలను ప్రజలకు వివరించాలని, డాక్యుమెంట్ రైటర్ల ఉపాధికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని చంద్రబాబు పేర్కొన్నారు.





హైదరాబాద్: సూపర్స్టార్ మహేశ్ బాబు తన కుమార్తె సితారాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆమెను ప్రేమతో ముద్దాడుతున్న ఫొటోను షేర్ చేసిన మహేశ్ ఎంత ఎదిగినా సితార తన లిటిల్ స్టారేనంటూ ఇన్స్టా వేదికగా పోస్ట్ పెట్టారు. ‘‘నువ్వు ఎంత పెద్దదానివైనా.. నాకు మాత్రం ఎప్పటికీ నా లిటిల్ స్టార్వే. 14వ పుట్టినరోజు శుభాకాంక్షలు సితార. ఈ ఏడాది నీకు అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నాను. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను’’ అని మహేశ్ పేర్కొన్నారు. ప్రస్తుతం మహేశ్ చేసిన ఈ పోస్ట్ సోషల్మీడియాలో వైరల్గా మారింది. అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా సితారకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరోవైపు మహేశ్ సతీమణి నమ్రత శిరోద్కర్ కూడా సితారకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ పోస్టు పెట్టారు. ‘మా జీవితాల్లో ఎంతో ఆనందం, ప్రేమను నింపిన నా అందాల కూతురికి పుట్టినరోజు శుభాకాంక్షలు నీ ఎదుగుదలను చూస్తుండటం నాకు దక్కిన అతి పెద్ద వరం. హ్యాపీ బర్త్ డే. ప్రేమతో..’’ అని ఆమె పేర్కొన్నారు.




హైదరాబాద్: ఏ ఒక్క ఊరిలో కాంగ్రెస్ వందశాతం రుణమాఫీ చేసినట్టు చూపెట్టాలని అడిగానని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. వందశాతం రుణమాఫీ చూపెడితే రాజీనామా చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ.. రుణమాఫీ కూడా సక్రమంగా చేయలేదని, షాపులో లేని యూరియా యాప్ లో దొరుకుతదా అని ప్రశ్నించారు. కరెంట్ కూడా సక్రమంగా ఇవ్వడం లేదని, ధాన్యం బస్తాలు కూడా దొరకడం లేదని విమర్శించారు. సంచులన్నీ ఢిల్లీకి పంపుతున్నారని, 4 సార్లు రైతుబంధు ఎగ్గొట్టారని కెటిఆర్ మండిపడ్డారు. కౌలు రైతులకు రూ. 15 వేలు ఇస్తానని మోసం చేశారని, మహిళలకు రూ.2,500 ఇస్తానని దగా చేశారని ధ్వజమెత్తారు. వృద్ధులకు రూ. 4 వేల పెన్షన్ ఇవ్వలేదని, ఒక ఎకరానికి ఒక మీటింగ్ పెడుతున్నారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం దగ్గర నీళ్లు సముద్రం లోకి వెళ్తున్నాయని, పంప్ ఆన్ చేస్తే నిజాం సాగర్ నిండుతుందని సూచించారు. సిఎం రేవంత్ రెడ్డి చెప్పిన అబద్ధమే ఆయనకు అడ్డం వస్తుందని దుయ్యబట్టారు. లక్ష క్యూసెక్కుల నీరు వృథాగా పోతుందని, రైతులంటే రేవంత్ కు పట్టింపు లేదని కెటిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.






