21523 వార్తలు

హైదరాబాద్: ఎగువన భారీ వర్షాలు కురవడంతో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం వీరాపురం సమీపంలోని ఇసుక క్వారీలో 38 మంది చిక్కుకున్నారు. వారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు స్థానిక జాలర్లు పడవల్లో అక్కడికి చేరుకున్నారు. స్థానిక సిఐ, ఎస్ఐ తన సిబ్బంది అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. వీరాపురంలో ఇసుక పాయల్లోకి వరద నీరు చేరుకోగానే లారీ డ్రైవర్లు, కూలీలు భయటకు వచ్చేశారు. ఇప్పుడు చిక్కుకున్న వారిలో 30 మంది డ్రైవర్లు, కూలీలు ఉన్నట్టు సమాచారం. మహారాష్ట్రాలో భారీ వర్షాలు కురవడంతో కాళేశ్వరం దగ్గర గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువన భారీ వర్షాల కురవడంతో గోదావరి, ప్రాణహిత నది ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది. త్రివేణి సంగమం దగ్గర 11 మీటర్ల ఎత్తుకు ప్రవాహం చేరుకోగా 12.210 మీటర్లకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర వరదం ప్రవాహం ముంచెత్తగా ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 5 లక్షల 66 వేల క్యూసెక్కులుగా ఉంది. ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురవడంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.








హైదరాబాద్: ప్రజలు సంతోషంగా ఉండాలనే ఆలోచన బిఆర్ఎస్ కు లేదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందా అనేదే బిఆర్ఎస్ ఆలోచనని అన్నారు. ఈ సందర్భంగా సిఎల్పి కార్యాలయం లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులకు ఇప్పటి వరకు ఒక్క పగులు కూడా రాలేదని తెలియజేశారు. కాంగ్రెస్ నిర్మించిన ప్రాజెక్టులకు ఎప్పుడైనా సమస్యలు వచ్చాయా? అని అడ్లూరి లక్ష్మణ్ ప్రశ్నించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు తుమ్మడిహట్టి వద్ద రూ. 15 వేల కోట్ల పనులు పూర్తయ్యాయని, జైపూర్ చెరువు నుంచి శ్రీపాద ఎల్లంపల్లికి నేరుగా నీళ్లు వదలొచ్చునని అడ్లూరి లక్ష్మణ్ సూచించారు. లిఫ్ట్ పెట్టి నీళ్లు వదిలితే మిషన్లు కొనొచ్చునని, కమీషన్లు తీసుకోవచ్చుననేదే బిఆర్ఎస్ ఆలోచనని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో చర్చ పెడితే బిఆర్ఎస్ నాయకులు ఎందుకు సమాధానం చెప్పలేదు? అడ్లూరి లక్ష్మణ్ అని ప్రశ్నించారు.

దులీప్ ట్రోఫీ 2026-27 సీజన్ కోసం ఈస్ట్ జోన్ స్క్వాడ్ను ప్రకటించింది. ఇందులో అనూహ్యంగా వైభవ్ సూర్యవంశీకి వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. సారథిగా ఇషాన్ కిషన్ను ఎంపిక చేశారు. ఇప్పుడిప్పుడే అంతర్జాతీయంగా కెరీర్ను ప్రారంభించిన వైభవ్పై వైస్ కెప్టెన్సీ బాధ్యతలు పెట్టడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఈ నిర్ణయాన్ని స్వాగతించగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ప్రముఖ వ్యాఖ్యత హర్ష భోగ్లే కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ‘‘రెడ్ బాల్ క్రికెట్లో.. అదీనూ సీనియర్లు ఉండే జట్టుకు వైభవ్ను వైస్ కెప్టెన్గా ఎలా నియమించారో నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంది. అతడు ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఇప్పటి వరకు సుదీర్ఘ ఫార్మాట్లో కేవలం 12 ఇన్నింగ్స్ మాత్రమే. 17.25 సగటుతో 207 పరుగులు చేశాడు. నేను అతడి టాలెంట్ని తక్కువ చేయడం లేదు. అద్భుతమైన నైపుణ్యం కలిగిన ప్లేయర్. కానీ, అతడు నేర్చుకోవాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి’’ అని హర్షా భోగ్లే పోస్ట్ పెట్టారు.






అమరావతి: ఎపి విద్యాశాఖ మంత్రి అక్రమాలకు పాల్పడ్డారని వైసిపి మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలను తనకు కావాల్సిన వాళ్లకు ఇచ్చుకున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డిఎస్ సి పరీక్షలో అక్రమాలు జరిగాయని విమర్శించారు. జనరల్ గా స్పోర్ట్స్ కోటా 2 శాతం ఉండాలి, కానీ ఎపి మంత్రి లోకేష్ 3 శాతానికి పెంచారని స్పోర్ట్స్ కోటా వాళ్లు ఎగ్జామ్ లో పాల్గొనాల్సిన అవసరం లేదని జివో మార్చి ఇచ్చారని మండిపడ్డారు. జివోలు రద్దు చేయడం, మళ్లీ పాత జివోను పునరుదరుద్దరించడంపై సమాధానం చెప్పాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. డిఎస్ సి ఎగ్జామ్ నిర్వాహణలో పాల్గొన్న వ్యక్తికి ర్యాంక్ వచ్చిందని మరి ఆయనకు ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదని అంబటి ప్రశ్నించారు. నీట్ పేపర్ లీక్ అయితే కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని అంబటి రాంబాబు చురకలంటించారు.







అమరావతి: నెల్లూరు జిల్లా సూరాయిపాలెం మద్యం దుకాణం వద్ద ఓ వ్యక్తి బీభత్సం సృషించాడు. మద్యం దుకాణానికి పెట్రోల్ పోసి నిప్పంటించేందుకు ప్రయత్నం చేశాడు. పొదలకూరు మండలం సూరాయిపాలెం మద్యం దుకాణం వద్ద రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సిగరెట్ కాల్చుకునేందుకు అగ్గిపెట్టె ఇవ్వలేదని ఆగ్రహం చెంది మద్యం దుకాణానికి పెట్రోల్ పోసి నిప్పంటించేందుకు సిద్ధపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిసిబ్బంది మంటలు ఆర్పేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.